Posted on 2026-04-06 12:05:53
డైలీ భారత్, హైదరాబాద్: ఆపదలో ఉన్న ఓ ఎనిమిదేళ్ల బాలికను తన సమయస్ఫూర్తితో రక్షించిన మహ్మద్ ఫిరోజ్ అనే యువకుడిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అభినందించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని పాత సీపీ కార్యాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో కలిసి ఫిరోజ్ను శాలువాతో సత్కరించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
ఈ నెల 1వ తేదీన అబిడ్స్ ప్రాంతంలోని ఒక పాఠశాల ముగిసిన తర్వాత, ఇంటికి వెళ్తున్న బాలికను మెహదీపట్నం హిల్స్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ సలీం మాయమాటలతో తన ఆటోలోకి ఎక్కించుకున్నాడు.
బాలికను గోల్కొండలోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అదే సమయంలో మసీదు నుంచి బయటకు వస్తున్న ఫిరోజ్.. ఆటోలో చిన్నారి ఏడుస్తుండటాన్ని గమనించారు. అనుమానం వచ్చి వెంటనే ఆటోను అడ్డుకున్నారు. భయంతో వణికిపోతున్న చిన్నారిని ప్రశ్నించగా.. డ్రైవర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఏడుస్తూ చెప్పింది. నిందితుడిని ఫిరోజ్ నిలదీయడంతో, ప్రమాదాన్ని ఊహించిన ఆటో డ్రైవర్ బాలికను అక్కడే వదిలేసి పరారయ్యాడు.
వెంటనే అప్రమత్తమైన ఫిరోజ్.. బాలిక దగ్గరున్న ఐడీ కార్డు లో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమె తండ్రికి సమాచారం అందించారు. అదే సమయంలో అప్పటికే ఆందోళనతో స్కూల్ దగ్గర బాలిక తల్లిదండ్రులు విలపిస్తున్నారు. విధులు ముగించుకుని వెళ్తున్న అబిడ్స్ పీఎస్ బ్లూ కోట్స్ కానిస్టేబుళ్లు సాయికృష్ణ, కేదార్ సింగ్ లు ఈ విషయాన్ని గమనించారు. ఫిరోజ్ ఫోన్ చేసిన విషయాన్ని వారు తెలుసుకుని తక్షణమే గోల్కొండకు చేరుకుని బాలికను సురక్షితంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో నిందితుడు సలీంను ఏప్రిల్ 2న అరెస్ట్ చేసిన పోలీసులు, ఆటోను సీజ్ చేసి రిమాండ్కు తరలించారు.
సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించే గుణం సమాజానికి ఆదర్శమని సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కొనియాడారు. నేరం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకుండా, బాధ్యతాయుతమైన పౌరుడిగా ఫిరోజ్ స్పందించారని ప్రశంసించారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి సమయస్ఫూర్తిని, సాహసాన్ని అలవరచుకోవాలన్నారు. నేర రహిత సమాజం దిశగా పౌరులు చూపే ఇలాంటి చొరవ వెలకట్టలేనిదన్నారు.
అలాగే, సమర్థవంతంగా పనిచేసి బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన బ్లూ కోట్స్ కానిస్టేబుళ్లు సాయికృష్ణ, కేదార్ సింగ్ ను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, జాయింట్ సీపీ ఎన్. శ్వేత, ఐపీఎస్, డీసీపీలు కె. శిల్పవల్లి, ఎస్. శ్రీనివాస్, లావణ్య నాయక్ జాదవ్, అబిడ్స్ ఏసీపీ పి. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన : జిల్లా బృందం
Posted On 2026-04-06 13:12:02
Readmore >
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి గ్రీన్ ఛానల్
Posted On 2026-04-06 12:25:47
Readmore >
ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. గేటును ఢీకొట్టి అసెంబ్లీలోకి దూసుకొచ్చిన కారు..
Posted On 2026-04-06 11:06:45
Readmore >
డీఎస్పీ అక్రమాస్తులు... పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ కారు!
Posted On 2026-04-06 10:51:56
Readmore >
ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాల్వంచ మండల సర్పంచుల ఫోరం మరియు వివిధ గ్రామ సర్పంచులు
Posted On 2026-04-06 10:25:39
Readmore >