డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అరుణాచలంలో రమణాశ్రమానికి ఎదురుగా ఉన్న ఈ గణపతి ఆలయం మధ్యలో ఉన్న అరుగుకు ఒక విశేషం ఉన్నది..1907 ప్రాంతంలో కావ్యకంఠ గణపతి ముని, వారి తమ్ముడు ఒక ఏకాదశి నాడు ఆకలి బాధతో ఎందరో ఇళ్ళకు వెళ్ళి అన్నం పెట్టమని అడుగగా, ఉపవాసం వల్ల ఎవ్వరూ పెట్టలేకపోతారు. చివరకు వారి తమ్ముడు కడుపు నొప్పితో చుట్టుకుపోతుంటే, ఒక ఇంటి అరుగు మీద పడుకోబెడతారు. ఆ ఇంటాయన సుందరేశ్వరుడు ఏకాదశి నాడు ఎవరైనా బ్రాహ్మణులకు భోజనం పెట్టే నియమం వారికి ఉన్నదని, వీరిని భోజనానికి ఆ ఇంట్లోకి తీసుకెళ్తారు. లోపల నుండి వారి ధర్మపత్ని మీనాక్షి పేరుతో వచ్చి, నవకాయ పిండివంటలతో కడుపునిండా భోజనం పెట్టీ, అరుగు మీద పడుకోమని చెప్పి, స్వయంగా తమలపాకులు, వక్క కూడా ఇస్తుంది..
అవి తిని, ఇంతటి మధుర భోజనం మునుపెన్నడూ తినలేదని ఆలోచిస్తూ గాడ నిద్రలోకి జారుకుంటారు. ఉదయం మెలుకువ వచ్చేసరికి అక్కడ తమలపాకు తొడిమెలు ఉంటాయి కానీ ఆ దంపతులు ఉండరు. పైగా ఆ ఇల్లు ఒక గణపతి ఆలయంగా మారిపోయి ఉంటుంది..
సాక్షాత్ ఆ శివ పార్వతులు మీనాక్షి సుందరేశ్వర పేర్లతో వారి బిడ్డల ఆకలి తీర్చిన సంఘటనకు ప్రత్యక్ష నిదర్శనం ఈ గణపతి మండపం..