Posted on 2026-05-18 19:17:25
వ్యాస కర్త: ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్, TPA రాష్ట్ర ఉపాధ్యక్షుడు
MSc Psychology, MSW Medical & Psychiatry, LLB
(తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక వ్యాసం)
డైలీ భారత్, స్పెషల్: ప్రస్తుత కాలంలో విద్య అంటే చాలా మంది కేవలం మార్కులు, ర్యాంకులు, పోటీ పరీక్షలు మాత్రమే అనుకుంటున్నారు. కానీ నిజమైన విద్య అనేది కేవలం పుస్తక జ్ఞానం కాదు. అది ఒక విద్యార్థిని మంచి మనిషిగా, బాధ్యతగల పౌరుడిగా, మానసికంగా దృఢంగా తయారు చేయాలి. చదువు జీవితానికి ఉపయోగపడాలి గానీ, జీవితాన్నే భారంగా మార్చకూడదు.
నేటి విద్యా వ్యవస్థలో చిన్న వయసు నుంచే విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. స్కూల్, ట్యూషన్లు, హోంవర్క్లు, పరీక్షలు, తల్లిదండ్రుల అంచనాలు, సమాజపు పోలికలు ఇవన్నీ కలిసి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. చాలా మంది పిల్లలు బయటకు సాధారణంగా కనిపించినా, లోపల భయం, ఒత్తిడి, నిరాశ, ఆందోళనలతో బాధపడుతున్నారు.
విద్యార్థుల్లో ప్రస్తుతం ఎక్కువగా కనిపించే సమస్యల్లో మెమొరీ ఇష్యూస్ ఒకటి. కొంతమంది పిల్లలు ఎంత చదివినా గుర్తుంచుకోలేకపోతారు. చదివిన విషయం కొద్దిసేపటికే మర్చిపోతుంటారు. దీనికి ఎప్పుడూ తెలివితక్కువతనం కారణం కాదు. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఏకాగ్రత లోపం, భయం వంటి అంశాలు మెమొరీపై ప్రభావం చూపుతాయి. పిల్లలు గుర్తుపెట్టుకోలేకపోతున్నారని వారిని తిట్టడం, ఇతరులతో పోల్చడం సమస్యను మరింత పెంచుతుంది.
కొంతమంది విద్యార్థులు చదివిన విషయాలను పరీక్ష సమయంలో మర్చిపోతుంటారు. హోంవర్క్లు, పుస్తకాలు, ముఖ్యమైన విషయాలు కూడా తరచూ మర్చిపోతారు. ఇది చాలాసార్లు Anxiety, Attention Problems లేదా మానసిక ఒత్తిడి వల్ల జరుగుతుంది. “నీకు ఏమీ గుర్తుండదు”, “నీవు పనికిరావు” వంటి మాటలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.
ప్రస్తుతం విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. “ఫస్ట్ రావాలి”, “మార్కులు ఎక్కువ రావాలి”, “ఇతరుల కంటే ముందుండాలి” అనే ఒత్తిడి వారిని లోపల నుంచి కుంగదీస్తోంది. ఈ ఒత్తిడి కారణంగా చిరాకు, కోపం, నిద్రలేమి, భయం, ఏడుపు, ఒంటరిగా ఉండటం, చదువుపై ఆసక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. కొందరు విద్యార్థులు తమ భావాలను ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
"పరీక్షల భయం వెంటాడుతోంది"
పరీక్షల భయం విద్యార్థుల్లో ఎక్కువగా కనిపించే సమస్య. పరీక్షల సమయం దగ్గరపడితే చాలామంది విద్యార్థుల్లో భయం పెరుగుతుంది. “ఫెయిల్ అయితే యెట్లా?”, “తల్లిదండ్రులు ఏమంటారో?”, “ఇతరులు ఎగతాళి చేస్తారేమో?” అనే ఆలోచనలు వారిని వెంటాడుతుంటాయి. ఈ భయం కారణంగా చేతులు వణకడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చదివినది గుర్తుకురాకపోవడం, పరీక్షకు వెళ్లడానికి కూడా భయపడటం వంటి పరిస్థితులు వస్తాయి. పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ, జీవితానికి ముగింపు కావని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.
"లెర్నింగ్ డిఫికల్టీస్ ఉండవచ్చు"
కొంతమంది పిల్లలకు Learning Difficulties కూడా ఉంటాయి. చదవడం, రాయడం, అక్షరాలు గుర్తుపట్టడం, గణితం అర్థం చేసుకోవడం వంటి విషయాల్లో కష్టాలు ఎదురవుతాయి. ఇవి చాలాసార్లు అలసత్వం కాదు. ఇలాంటి పిల్లలను “మొద్దు”, “చదవడు” అని ముద్ర వేయడం చాలా ప్రమాదకరం. వారికి ప్రత్యేక శ్రద్ధ, సహనం, సరైన మార్గదర్శనం అవసరం.
చదువు అంటే గంటలకొద్దీ పుస్తకాల ముందు కూర్చోవడం మాత్రమే కాదు. ఎలా చదవాలి అనేది కూడా విద్యార్థులకు నేర్పించాలి. టైమ్ టేబుల్ తయారు చేసుకోవడం, చిన్న చిన్న భాగాలుగా చదవడం, రివిజన్ చేయడం, నోట్స్ తయారు చేసుకోవడం, సరైన నిద్ర పోవడం, మొబైల్ వినియోగాన్ని తగ్గించడం వంటి మంచి Study Skills విద్యార్థుల ఏకాగ్రతను పెంచుతాయి.
"తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి"
విద్యార్థుల చదువులో ఉండే సమస్యలను తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి పిల్లవాడు ఒకేలా ఉండడు. ప్రతి విద్యార్థికి తనకంటూ ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది. కొందరు చదువులో బాగా ఉంటారు, మరికొందరు కళలు, క్రీడలు లేదా ఇతర రంగాల్లో ప్రతిభ చూపుతారు.
తల్లిదండ్రులు పిల్లలను ఇతరులతో పోల్చకూడదు. వారి భావాలను వినాలి. విఫలమైనప్పుడు తిట్టకుండా ధైర్యం చెప్పాలి. చదువుపట్ల నిరక్ష్యం ఉంటే ప్రేమతో వివరించాలి. పిల్లలకు ఇంట్లో భద్రత, ప్రేమ, అండ ఉంటే వారు మానసికంగా బలంగా ఎదుగుతారు.
"విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో సైకాలజిస్టుల పాత్ర"
విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో సైకాలజిస్టుల పాత్ర ప్రత్యేకమైనది. సైకాలజిస్టులు విద్యార్థుల భావోద్వేగ సమస్యలను అర్థం చేసుకొని వారికి కౌన్సెలింగ్ అందిస్తారు. పరీక్షల భయాన్ని తగ్గించే పద్ధతులు నేర్పిస్తారు. Stress Management Techniques, మెమొరీ మరియు Concentration పెంచే విధానాలు సూచిస్తారు.
Learning Difficulties ను గుర్తించడంలో సహాయం చేస్తారు. తల్లిదండ్రులకు, టీచర్లకు సరైన మార్గదర్శనం అందిస్తారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి జీవితంపై సానుకూల దృక్పథం కలిగించడంలో సైకాలజిస్టుల పాత్ర కీలకం.
సైకాలజిస్టులు విద్యార్థులకు సరైన Study Skills నేర్పిస్తారు. ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా రివిజన్ చేయాలి వంటి విషయాల్లో మార్గనిర్దేశనం చేస్తారు. చదువు పట్ల ఆసక్తి పెంచే పద్ధతులు నేర్పిస్తారు.
Listening Skills కూడా విద్యార్థి జీవితంలో చాలా ముఖ్యమైనవి. క్లాస్లో టీచర్ చెప్పేది శ్రద్ధగా వినడం, ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం, మధ్యలో దృష్టి మళ్లకుండా ఉండడం వంటి నైపుణ్యాలను సైకాలజిస్టులు అభివృద్ధి చేస్తారు. మంచి Listening Skills ఉంటే చదువు సులభంగా అర్థమవుతుంది.
ప్రస్తుతం విద్యార్థులకు Presentation Skills కూడా ఎంతో అవసరం. చాలామంది పిల్లలు స్టేజ్ ముందు మాట్లాడటానికి భయపడుతుంటారు. సైకాలజిస్టులు వారి భయాన్ని తగ్గించి, ధైర్యంగా మాట్లాడే విధానం, Eye Contact maintain చేయడం, మాటల్లో స్పష్టత తీసుకురావడం వంటి అంశాలను నేర్పిస్తారు. దీంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మెమొరీ సమస్యలతో బాధపడే విద్యార్థులకు ప్రత్యేక Memory Techniques నేర్పిస్తారు. Visualization, Association, Repetition, Mind Mapping వంటి పద్ధతుల ద్వారా విషయాలను సులభంగా గుర్తుంచుకునే విధానాలు సూచిస్తారు. సరైన నిద్ర, ఆహారం, వ్యాయామం కూడా మెమొరీపై ప్రభావం చూపుతాయని అవగాహన కల్పిస్తారు.
Time Management కూడా విద్యార్థి జీవితంలో చాలా ముఖ్యమైనది. చాలా మంది విద్యార్థులు సమయాన్ని సరిగా ఉపయోగించుకోలేక ఒత్తిడికి గురవుతుంటారు. సైకాలజిస్టులు చదువు, విశ్రాంతి, ఆటలు, నిద్ర ఇవన్నింటికీ సమతుల్యత ఉండేలా టైమ్ ప్లానింగ్ నేర్పిస్తారు. మొబైల్ వినియోగాన్ని తగ్గించడం, ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి పద్ధతులు సూచిస్తారు.
చదువు అనేది కేవలం మార్కుల కోసం జరిగే పోటీ కాదు. అది ఒక మనిషిని జీవితానికి సిద్ధం చేసే ప్రక్రియ. విద్యార్థి మానసిక ఆరోగ్యం, భావోద్వేగ స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం ఇవన్నీ కూడా విద్యలో భాగమే.
పిల్లలపై ఒత్తిడి పెంచడం కాదు, వారిని అర్థం చేసుకోవడం ముఖ్యం. మార్కుల కంటే మానవత్వం గొప్పది అనే విలువలను నేర్పించాలి. విద్యార్థి సంతోషంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగితేనే నిజమైన విద్య సాధించినట్లవుతుంది.
Visit Us:
Sanjana Clinic
(Neuro Psychiatric & Counseling Center)
Shiva Nagar Khaman, Main Road, Sircilla.
15+ years of Experience in Mental Health
బంగాళాఖాతంలో భారీ మేఘాల ప్రభావం.. పలు రాష్ట్రాలకు హెచ్చరికలు
Posted On 2026-05-19 08:22:53
Readmore >
గోమతి నగర్ రైలులో దారుణం ఘటన...యువతిని ముక్కలుగా నరికి పెట్టెలో దాచారు ..!
Posted On 2026-05-19 08:21:33
Readmore >
జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన మాలోత్ మంగీలాల్ నాయక్ శుభాకాంక్షలు తెలియజేసిన పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు
Posted On 2026-05-18 23:30:40
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసుల కఠిన చర్యలు – ఒకరికి జైలు శిక్ష.
Posted On 2026-05-18 19:27:39
Readmore >