Posted on 2026-05-13 11:31:25
హైదరాబాద్లో మరో నేపాలీ గ్యాంగ్ భారీ దోపిడి
డైలీ భారత్, హైదరాబాద్: నగరంలో వరుస దోపిడీ ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య ఘటన ఇంకా మర్చిపోకముందే, మరోసారి నేపాలీ గ్యాంగ్ పేరుతో జరిగిన భారీ దోపిడి కలకలం రేపింది.
జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గల్ఫ్ ఎంక్లేవ్ కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ విజయలక్ష్మి, మురళీమోహన్ దంపతుల ఇంట్లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో పని కోసం ఇటీవల చేరిన ఇద్దరు నేపాలీ యువకులు తమ సహచరులతో కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, దంపతులకు ముందుగా మత్తు మందు ఇచ్చిన నిందితులు, అనంతరం వారి కాళ్లు చేతులు కట్టేసి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను దోచుకెళ్లారు. సుమారు 60 తులాల బంగారం, రూ.30 వేల నగదు అపహరించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ముఠా పాల్గొన్నట్లు సమాచారం. ఇందులో ఇద్దరు నిందితులు కేవలం 13 రోజుల క్రితమే ఇంటి పనుల కోసం చేరినట్లు తెలిసింది. ఇంటి పరిస్థితులు, అలవాట్లు, భద్రతా వివరాలు గమనించిన తర్వాత పథకం ప్రకారం దోపిడీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జవహర్నగర్ పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కాలనీలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నగర సరిహద్దుల వద్ద అలర్ట్ ప్రకటించినట్లు సమాచారం.
ఇటీవల నగరంలో గృహ సహాయకుల పేరుతో జరిగే నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, కొత్తగా పనిలో చేరే వ్యక్తుల పూర్తి వివరాలు, ఆధార్, ఫోన్ నంబర్లు, స్థానిక పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఈ ఘటనతో గల్ఫ్ ఎంక్లేవ్ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నగరంలో వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగించిన ట్రాఫిక్ పోలీసులు, ఆటో డ్రైవర్
Posted On 2026-05-13 09:21:45
Readmore >
గౌడ సంఘం ఆధ్వర్యంలో... తల్లాడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
Posted On 2026-05-12 22:02:07
Readmore >
పాపకొల్లు గ్రామంలోప్రవీణ్ నిమ్మటూరి షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
Posted On 2026-05-12 19:21:38
Readmore >