Posted on 2026-03-29 15:40:37
24 గంటల్లోనే కేసును ఛేదించిన గాంధారి పోలీసులు
నేరం చేసిన వారు పోలీసుల నుండి తప్పించుకోలేరు.
వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన గాంధారి పోలీస్ టీమ్ను అభినందించిన జిల్లా ఎస్పీ
వివరాలు వెల్లడించిన సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సంతోష్ కుమార్
డైలీ భారత్, గాంధారి:నమ్మించి గొంతు కోసింది.. అత్తను అత్యంత కిరాతకంగా చంపి, ఏమీ ఎరగనట్లుగా డ్రామా ఆడింది. కానీ, గాంధారి పోలీసుల నిశిత విచారణలో ఆ కోడలే నేరం చేసినట్లు తెలిసింది. సీతాయిపల్లి గ్రామంలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించి, నిందితురాలిని కటకటాల్లోకి నెట్టారు పోలీసులు
తేదీ: 28-03-2026 నాడు ఫిర్యాదురాలు సజ్జనపల్లి శాంతవ్వ, భర్త కాశిరాం, వయసు 55 సంవత్సరాలు, నివాసం భవానిపేట్ గ్రామం, లింగంపేట్ మండలం వారు ఫిర్యాదు చేయగా, ఆమె అన్న కొడుకు బాలరాజు ద్వారా తమ తల్లి రుక్మవ్వ (సీతాయిపల్లి గ్రామం) మరణించిన విషయం ఉదయం సుమారు 7:00 గంటలకు తెలియజేయబడినది. వెంటనే ఫిర్యాదురాలు భవానిపేట్ నుండి సీతాయిపల్లి గ్రామానికి వెళ్లి తన తల్లిని పరిశీలించగా, తల వద్ద రక్తస్రావం ఉండడం గమనించబడింది. అదేవిధంగా చెవి కమ్మలు, మెడలో ఉన్న బంగారు గుండ్లు కనిపించకపోవడం, ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా ఉండడం గుర్తించబడినది. ఈ విషయంపై అనుమానం వ్యక్తం చేస్తూ, ఫిర్యాదురాలు తన వదిన కోటవ్వను ప్రశ్నించగా, బాధితురాలు కిందపడడంతో తలకు గాయం అయ్యి చనిపోయిందని తెలిపినది. అయితే మధ్యాహ్నం సుమారు 3:30 గంటలకు మృతదేహానికి స్నానం చేయించే సమయంలో తలకు ఏదో ఆయుధంతో కొట్టినట్లుగా, ఎడమ వైపు తీవ్ర గాయం ఉన్నట్లు గుర్తించబడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఫిర్యాదురాలు తన తల్లి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చని గాంధారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇట్టి కేసులో జిల్లా ఎస్పీ ఆదేశాలతో యెల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో సీఐ సదాశివనగర్ గారు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేయగా, మృతురాలి కోడలు అయిన కావటి కోటవ్వపై అనుమానం వ్యక్తం చేసి, సదాశివనగర్ సీఐ సంతోష్, గాంధారి ఎస్ఐ ఆంజనేయులు ఘటన స్థలానికి చేరుకొని, అనంతరం హత్యకు గల వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకొని నిందితురాలు అయిన మృతురాలి కోడలు కోటవ్వను అదుపులోకి తీసుకుని విచారించగా, కోటవ్వ రాయితో రుక్మవ్వను తలపై కొట్టి చంపి, ఆమె మెడలో ఉన్న సుమారు 1.5 తులాల బంగారు గుండ్లు మరియు బంగారు కమ్మ దొంగతనం చేసినట్లు విచారణలో వెల్లడైనది.
గాంధారి మండలంలోని సీతాయిపల్లి గ్రామానికి చెందిన కావటి రుక్మవ్వ (73)కు ముగ్గురు కుమారులు కలరు. ముగ్గురు కుమారుల్లో పెద్ద కుమారుడు, నడిపి కుమారుడు మృతి చెందగా, చిన్న కుమారుడు హైదరాబాదులో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో నడిపి కుమారుడైన భూమయ్య భార్య అయిన కోటవ్వకు మృతురాలు రుక్మవ్వతో అనేకసార్లు బంగారం, డబ్బుల విషయాలలో గొడవలు జరిగేవి. గత కొన్ని రోజుల క్రితం కోడలు అత్తను డబ్బులు అడగగా ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకొని, అత్త దగ్గర ఉన్న బంగారం మరియు నగదును కాజేయాలనే ఉద్దేశంతో, తేదీ 28-03-2026 రాత్రి డబ్బులు ఇవ్వలేదని మరియు దూషించిందని కోపంతో, కోడలు తెల్లవారుజామున అత్త పడుకున్న ఇంటికి వెళ్లి రాయితో తలపై దాడి చేసి హత్య చేసింది. హత్య అనంతరం ఘటనను బయటపడకుండా ఉండేందుకు రక్తపు ఆనవాళ్లను తుడిచేసి, బంగారు ఆభరణాలు దొంగిలించింది
నిందితురాలి వివరాలు: కావటి కోటవ్వ, భర్త: భూమయ్య, వయసు 63 సంవత్సరాలు, నివాసం సీతాయిపల్లి గ్రామం.
నిందితురాలి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నవి:
13.8 గ్రాముల బంగారు గుండ్లు మరియు 1.2 గ్రాముల బంగారు చెవి కమ్మ ఒకటి. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడమైనది.
కేసును అత్యంత వేగంగా ఛేదించిన సదాశివనగర్ సీఐ బి. సంతోష్ కుమార్, గాంధారి ఎస్ఐ ఆంజనేయులు, మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రవి కుమార్, కానిస్టేబుల్ లు సాందీప్ జానకిరాము, లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
కారు డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన టివికె పార్టీ అధినేత విజయ్
Posted On 2026-03-29 14:51:40
Readmore >
తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు
Posted On 2026-03-29 13:54:01
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం వన్ టౌన్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టివేత
Posted On 2026-03-29 13:33:25
Readmore >