Posted on 2025-10-14 21:14:36
డైలీ భారత్, కర్నూల్:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన కర్నూలు జిల్లాలో నిర్వహించనున్న మహాసభ ఏర్పాట్లపై కర్నూల్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహచర మంత్రులతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, జిల్లా ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ ప్రధానమంత్రి పర్యటన మన రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ సభలో వేలాదిమంది ప్రజలు పాల్గొనబోతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, రవాణా, పార్కింగ్, నీరు, వైద్య సదుపాయాలు, భద్రత, వేదిక ఏర్పాట్లు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సభ విజయవంతం కావడం మన అందరి బాధ్యత. ఏ ఒక్క విభాగం నిర్లక్ష్యం వహించకూడదు. ప్రతి శాఖ అధికారులూ, నాయకులూ తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలి. రోడ్లు, ట్రాఫిక్ మార్గాలు, వసతి, భద్రతా ఏర్పాట్లు సవ్యంగా ఉండేలా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రజలు సౌకర్యంగా సభ ప్రాంగణానికి చేరుకుని, తిరిగి సురక్షితంగా వెళ్లేలా అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. కూటమి పక్షాలన్నీ ఒకే దిశగా ఆలోచించి, సమన్వయ భావంతో పని చేయాలని ఆయన సూచించారు. మనందరం ఒక జట్టుగా కృషి చేస్తేనే సభ చారిత్రాత్మకంగా నిలుస్తుంది. ప్రధాని పర్యటన రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని అవకాశాలను తెస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ శ్రద్ధను, సమయాన్ని, కృషిని ఈ సభ విజయవంతానికి అంకితం చేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
సమావేశంలో సభ ప్రాంగణం, వేదిక డిజైన్, ప్రజల రాకపోకల మార్గాలు, పార్కింగ్ జోన్లు, భద్రతా బందోబస్తు తదితర అంశాలపై సమీక్ష జరిగింది. అధికారులు తగిన సూచనలు అందించి, అవసరమైన మార్పులు, మెరుగుదలలపై చర్చించారు. ఈ సభలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త తన వంతు పాత్ర పోషిస్తే, కర్నూలు సభను దేశం మొత్తానికి ఆదర్శంగా నిలబెట్టగలమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >