| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం... అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం...  అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

ప్రేమ పేరుతో వంచించిన కానిస్టేబుల్.. యువతి ఆత్మహత్య

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక- జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన రఘునాథ్​ గౌడ్‌కు హైదరాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో పరిచయం ఏర్పడింది. స్నేహం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారి, గుట్టుగా పెళ్లి చేసుకునే వరకూ వెళ్లింది. ఈలోపు అతనికి కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో అందరినీ ఒప్పించి కాపురానికి తీసుకువెళ్తానని నమ్మించాడు. చివరకు ముఖం చాటేశాడు. కొన్ని నెలల తర్వాత రఘునాథ్‌ గౌడ్‌ను వెతుక్కుంటూ అతని సొంత గ్రామం చిన్నోనిపల్లికి ప్రియాంక చేరుకుంది. ప్రేమించి, పెళ్లి చేసుకున్నప్పుడు అడ్డురాని కులం, ఆ వ్యక్తికి కాపురానికి మాత్రం అడ్డొచ్చింది. కుటుంబ సభ్యులు, బంధువుల మాటలు విని కాపురానికి అతను ససేమిరా అన్నాడు

దీంతో ప్రియాంక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయినా అతను పట్టించుకోలేదు. అతనిపై అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపింది. జైళ్లో ఉన్నన్ని రోజులు రఘునాథ్‌గౌడ్ ఊళ్లోనే అతని కోసం ఎదురు చూస్తూ ఒంటరి పోరాటం చేసింది. అతని కుటుంబసభ్యులు ప్రియాంక వైపు కన్నెత్తైనా చూడలేదు. ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన రఘునాథ్‌, శుక్రవారం మల్దకల్‌లో ఉన్నాడని తెలుసుకుని తన సంగతేంటో తేల్చాలని ప్రియాంక అక్కడికి వెళ్లింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే 108లో ఆమెను గద్వాల ప్రభుత్వాసుపత్రికి పంపారు. కోలుకున్న ప్రియాంక మళ్లీ మల్దకల్‌కు వెళ్లింది. అక్కడి నుంచి శుక్రవారం అర్ధరాత్రి చిన్నోనిపల్లికి చేరుకుని మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను మళ్లీ గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ప్రియాంక ప్రాణాలు విడిచింది.

అయితే ప్రియాంక మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్దకల్ వెళ్లిన ప్రియాంకను రఘునాథ్​ గౌడ్ కుటుంబ సభ్యులు, బంధువులు విషమిచ్చి చంపారని ఆరోపించారు. అపస్మారక స్థితిలో అర్ధరాత్రి ఆసుపత్రికి చేరుకున్న ప్రియాంకను ఆసుపత్రిలోనూ పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు కానిస్టేబుల్​పై కేసు నమోదు చేసి 3 నెలలుగా న్యాయపోరాటం చేస్తున్నా, పోలీసులు గాని, ప్రజాప్రతినిధులుగాని పట్టించుకోకపోవడంపై ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. కానిస్టేబుల్ సహా అతని బంధువులపై చర్యలు తీసుకోవాలంటూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగాయి. ప్రియాంక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్​ను ఎస్పీ సస్పెండ్ చేశారు. రఘునాథ్, అతని కుటుంబ సభ్యులు సహా 22 మంది బంధవులపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Previous ప్రజావాణి కార్యక్రమం రద్దు : జిల్లా కలెక్టర్ ఎం. హరిత
Next స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజావాణి రద్దు
ADVERTISEMENT