Posted on 2024-09-19 19:06:43
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: బీసీ కుల గణనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘‘ బీసీ కులగణన మీద కేటీఆర్ మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో ఎంత జనాభా అంత వాటా అని చెప్పారన్నారు. అసెంబ్లీలో ఇప్పటికే బీసీ కులగణన బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
బీసీ కులగణన కోసం జీవో విడుదల చేశారని.. త్వరలోనే కులగణన జరుగుతుందని సీఎం చెప్పారన్నారు. 42శాతం రిజర్వేషన్కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘‘మేము అడిగితే చేశారని చెప్పుకునే కుటిల బుద్ధితో వ్యవహరిస్తున్నారు. పదేళ్లలో కుల గణన చేయాలనే ఆలోచన ఎందుకు మీకు రాలేదు. బీఆర్ఎస్ ప్రెసిడెంట్.. వర్కింగ్ ప్రెసిడెంట్.. అసెంబ్లీ ప్రతిపక్ష నేత పదవుల్లో బీసీలు ఎవరూ లేరు. మీలాగా తండ్రి చాటున కొడుకుగా.. మామ చాటున ల్లుడిగా రేవంత్ రెడ్డి ఎదగలేదు’’ అంటూ విమర్శించారు.
పీసీసీ చీఫ్ పదవి బీసీలకు ఇచ్చామన్నారు. భవిష్యత్లో బీసీలకు మరింత అవకాశాలు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ‘‘మీరు మాకు డెడ్ లైన్ పెట్టడం ఎంటి..? బీసీ కుల గణన చేసి తీరుతాం.. హైకోర్టు కూడా మూడు నెలలలో నివేదిక పంపాలని సూచించింది తప్పక చేస్తాం. మా పాలన చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. మీ పార్టీలో.. ప్రభుత్వంలో ఆ నలుగురే ఉన్నారు.. ఇప్పుడు కూడా ఆ నలుగురే మిగులుతారు. తొమ్మిది ఏళ్ల మీ విధ్వంస పాలనను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. గల్ఫ్ కార్మికులను మీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వారి కోసం మా ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. గల్ఫ్ కార్మికులు మరణిస్తే.. ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. బీఆర్ఎస్ గా పేరు మార్చుకోవడంతో తెలంగాణ ప్రజలతో పేగు బంధం తెంచుకున్నారు.
కేటీఆర్ సుద్దపూస మాటలు మానుకోవాలి. కేటీఆర్కు బీసీ కులగణన నవంబర్లోగా చేయకపోతే ప్రత్యక్ష పోరాటం అంటున్నారు. కేటీఆర్కు సవాల్ విసిరే హక్కు కూడా లేదు.. తొమ్మిది ఏళ్లు మీరు ఏం చేశారు. మేము తప్పక బీసీ కులగణన చేసి తీరుతాం. సమగ్ర కుటుంబ సర్వేతో కోడి గుడ్ల లెక్క కూడా తీశారు.. ఆ సర్వే రిపోర్ట్ బయట పెట్టకుండా ఏం చేశారు. ఆ రిపోర్ట్ను మీ స్వార్ధానికి ఉపయోగించుకున్నారు’’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
జమిలీ ఎన్నికలు అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన.. అవుతుందా లేదా అనేది చూడాలన్నారు. 2029 లో జమిలీ నిర్వహిస్తారా..? ఇతర రాష్ట్రాల్లో పాలన పొడగీస్తారా.. ఇలా అనేక సమస్యలు ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ చిట్టి నాయుడు అంటున్నారని. మరి ఆ బాబు సహకారం లేనిది కేసీఆర్ ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు. వాళ్ళ మెప్పు కోసం కేటీఆర్కు ఆ పేరు పెట్టారని.. కేటీఆర్ను బాబు చిట్టి అని పిలువాలి అంటూ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >