Posted on 2026-06-16 17:35:59
డైలీ భారత్, వరంగల్: ప్రజల భద్రతే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. తమ పరిసరాల్లో ఎవరైనా గుర్తు తెలియని లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కాజీపేట రైల్వే స్టేషన్లో సీసీఎస్ (CCS) పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనుమానితుల తనిఖీలను పోలీస్ కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా తనిఖీల్లో పాల్గొని పోలీసుల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి చెందిన కొందరు నేరస్థులు వరంగల్ నగరానికి చేరుకుని ఇళ్ల చోరీలు, చైన్ స్నాచింగ్లు మరియు ఇతర ఆస్తి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలను కలిపే ప్రధాన రైల్వే జంక్షన్లుగా వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లు ఉండటంతో నేరస్థులు రైలు మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకుని నేరాలకు పాల్పడి, అనంతరం తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారని తెలిపారు.
ఈ తరహా నేరాలను అరికట్టేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీసీఎస్ పోలీసుల ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వీటిలో రెండు బృందాలు వరంగల్ రైల్వే స్టేషన్లో, మరో రెండు బృందాలు కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సహకారంతో విధులు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చే రైళ్లలో ప్రయాణించే అనుమానిత వ్యక్తులను ఈ ప్రత్యేక బృందాలు గుర్తించి వారి సామగ్రితో పాటు పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తున్నాయని తెలిపారు. వారి వ్యక్తిగత వివరాలను సేకరించి, వేలిముద్రలు, ఫొటోలు తీసి, ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతతో పాటు పోలీసు శాఖ వద్ద ఉన్న ఆధునిక డేటాబేస్లతో సరిపోల్చి పరిశీలిస్తున్నామని వివరించారు.
తనిఖీల సమయంలో ఎవరైనా వ్యక్తి గతంలో నేరాలకు పాల్పడినట్లు రికార్డుల్లో ఉన్నట్లయితే, పోలీసుల వద్ద ఉన్న సాంకేతిక పరికరాల ద్వారా క్షణాల్లో ఆ వివరాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అటువంటి సందర్భాల్లో వెంటనే అప్రమత్తమై సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తరలిస్తామని చెప్పారు.
అదేవిధంగా తనిఖీల సందర్భంగా సేకరించిన అనుమానితుల వివరాలను రికార్డుల రూపంలో భద్రపరుస్తున్నామని, నాలుగు మంది సభ్యులతో కూడిన ప్రతి ప్రత్యేక బృందం షిఫ్ట్ల వారీగా నిరంతరం విధులు నిర్వహిస్తూ అంతర్రాష్ట్ర నేరస్థుల కదలికలపై నిఘా ఉంచుతోందని కమిషనర్ తెలిపారు.
ఈ తనిఖీల్లో క్రైమ్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, జీఆర్పీ డీఎస్పీ కృపాకర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, జీఆర్పీ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్ఐ అభినవ్తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >