Posted on 2026-06-15 19:25:13
రెండు తెలుగు రాష్ట్రాల్లో ATM కార్డులు మార్చి ప్రజల ఖాతాలు ఖాళీ చేస్తున్న అంతర్రాష్ట్ర మోసగాడు అరెస్ట్ రిమాండ్కు తరలింపు
డైలీ భారత్, కామారెడ్డి: వృద్ధులు, అమాయకులనే లక్ష్యంగా చేసుకుని ATM కార్డులు మార్చి లక్షలు కాజేసిన ఘరానా కేటుగాడి ఆటకట్టించిన మాచారెడ్డి పోలీసులు
రైతుకు రూ.49 వేల టోకరా.. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో అంతర్రాష్ట్ర ATM మోసగాడిని పట్టుకున్న పోలీసు బృందం
విలాసవంతమైన జీవితానికి అడ్డదారి.. రాపిడో డ్రైవర్గా ఉంటూ రెండు రాష్ట్రాల్లో ATM మోసాలకు పాల్పడిన నిందితుడు రిమాండ్
మరో ATM మోసానికి యత్నిస్తుండగా వలపన్ని పట్టుకున్న మాచారెడ్డి ప్రత్యేక పోలీసు బృందాలు
కేసు వివరాలను వెల్లడించిన కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్
లచ్చపేట గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నర్సింలు (53) అనే రైతు తన కొత్త ATM కార్డుకు PIN నంబర్ జనరేట్ చేసుకోవడానికి మాచారెడ్డి SBI ATM కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ATM వినియోగంపై అవగాహన లేకపోవడంతో పక్కనే ఉన్న ఒక గుర్తుతెలియని వ్యక్తి సహాయం తీసుకున్నాడు. ఇదే అవకాశంగా భావించిన నిందితుడు, రైతుకు తెలియకుండా ఆయన ATM కార్డును మార్చి, వేరొక కార్డును అతనికి ఇచ్చి మోసగించాడు. అనంతరం బాధితుడి ఖాతా నుండి ఎల్లారెడ్డిపేట మరియు హైదరాబాద్లోని కూకట్పల్లి ATM కేంద్రాల ద్వారా విడతలవారీగా మొత్తం రూ.49,000/- నగదును అక్రమంగా డ్రా చేశాడు. మోసాన్ని గుర్తించిన బాధితుడు మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వ్యూహాత్మక దర్యాప్తు - నిందితుడి అరెస్ట్
జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారి ఆదేశాల మేరకు, కామారెడ్డి డీఎస్పీ శ్రీ మధుసూదన్ గారి పర్యవేక్షణలో, కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, మాచారెడ్డి ఎస్ఐ అనిల్ మరియు సీసీఎస్ బృందం తమ సిబ్బందితో కలిసి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
ఈ రోజు (15.06.2026) మాచారెడ్డి చౌరస్తాలోని SBI ATM వద్ద మళ్లీ ఇలాంటి మోసానికి పాల్పడేందుకు నిందితుడు వచ్చిన సమయంలో, అక్కడ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంటాడి పట్టుకున్నారు. విచారణలో అతని పేరు సీపాల ఈశ్వరయ్య అని తేలింది. తానే ఈ మోసానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు.
విచారణలో నిందితుడు సీపాల ఈశ్వరయ్య రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ATM కార్డుల మార్పిడి మోసాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. ప్రస్తుత మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడి ATM కార్డు మార్చి రూ.49,000/- డ్రా చేయడంతో పాటు, గతంలో కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనియన్ బ్యాంక్ ATM వద్ద కూడా ఒకరి కార్డు మార్చి సుమారు రూ.90,600/- కాజేసినట్లు ఒప్పుకున్నాడు.
అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ కడప జిల్లా వెంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న SBI ATM కేంద్రంలో ఇదే తరహాలో కార్డు మార్పిడి చేసి రూ.30,000/- నగదును అక్రమంగా డ్రా చేసినట్లు వెల్లడించాడు. అలాగే నిజామాబాద్ జిల్లా పరిధిలో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని ఒక వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకుని, ఆమె ATM కార్డు ద్వారా రూ.10,000/- నగదును అక్రమంగా ఉపసంహరించుకున్నట్లు విచారణలో అంగీకరించాడు.
నిందితుడి వివరాలు:
సీపాల ఈశ్వరయ్య @ ఈశ్వర్ @ శివ (30 సంవత్సరాలు), తండ్రి: పాపన్న, వృత్తి: రాపిడో బైక్ డ్రైవర్, స్వస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం గచ్చిబౌలి, హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు.
నిందితుడి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నవి:
1. నగదు – రూ.46,000/-, 2. VIVO V27 మొబైల్ ఫోన్ 3. SBI ATM (Global) Card
2. నిందితుడు సీపాల ఈశ్వరయ్యపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. తూప్రాన్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, రామాయంపేట్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, జనగాం పోలీస్ స్టేషన్లో 1 కేసు, షాబాద్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో 1 కేసు, అలాగే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGI Airport) పోలీస్ స్టేషన్లో 1 కేసు నమోదైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు.
ఈ అంతర్రాష్ట్ర ATM మోసాల కేసును అత్యంత చాకచక్యంగా, వేగంగా ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని కామారెడ్డి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.
ఈ కేసు దర్యాప్తులో మరియు నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన కామారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎస్. రమన్, మాచారెడ్డి ఎస్ఐ అనిల్, సీసీఎస్ ఎస్ఐ ఎం.డి. ఉస్మాన్ గార్లతో పాటు మాచారెడ్డి పోలీస్ స్టేషన్ మరియు సీసీఎస్ సిబ్బంది శ్రావణ్, శ్రీకాంత్, రాజవీరు, జి. లక్ష్మీకాంత్, రవి, చేతన్ మరియు ఐటీ కోర్ టీమ్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను జిల్లా ఎస్పీ వారి అద్భుత ప్రతిభకు గాను ప్రత్యేకంగా ప్రశంసించారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >