Posted on 2026-04-23 10:03:16
డైలీ భారత్, మిర్జాపూర్: ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మీర్జాపుర్ జిల్లాలో ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడం గొలుసుకట్టు ప్రమాదానికి దారి తీసింది. ఈ ఘటనలో రెండు వాహనాల్లో మంటలు చెలరేగి చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రామాండ్గంజ్ లోయ నుంచి లాసోడా ప్రాంతం వైపు వెళ్తున్న ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిలై, ఎదురుగా వెళ్తున్న మరో ట్రక్కును ఢీకొట్టింది. ఆ సమయంలో రెండింటి మధ్యలో ఉన్న కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. కాగా, ప్రమాద దాటికి రెండు కార్లలో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు, ప్రమాద ఘటనపై మీర్జాపుర్ ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ వివరాలు వెల్లడించారు. "బుధవారం, రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో, బ్రాహ్మణ గంజ్ (స్థానికంగా "భైసోడ్" అని పిలిచే ప్రాంతం)లో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. ప్రాథమిక నిర్ధరణలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లనే దాని ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టినట్లు తెలిసింది. అయితే, ముందు వెళ్తున్న మరో ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో రెండింటి మధ్యలో ఒక కారు చిక్కుకుపోయింది. అలాగే, మరొక కారును కూడా ఢీకొట్టింది. దీంతో కార్లలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నాం. ఘటనా స్థలి నుంచి ట్రక్కులను తొలగించే పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ప్రమాదానికి గురైన ట్రక్కుల్లో ఒకదానికి బిహార్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండగా, మరొకదానికి మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది. అలాగే, కార్లలో ఒకటి సోన్భద్ర జిల్లాకు చెందినది కాగా, మరొకటి మీర్జాపుర్ జిల్లాకు చెందినది" అని అపర్ణ రజత్ కౌశిక్ పేర్కొన్నారు.
కాగా, మరణించిన వారిలో ఏడుగురు మీర్జాపుర్ జిల్లా వాసులని, ముగ్గురు మధ్యప్రదేశ్ వాసులని, ఒకరు సోన్భద్ర జిల్లాకు చెందినవారని జిల్లా కలెక్టర్ పవన్ గంగ్వార్ తెలిపారు. మీర్జాపుర్ జిల్లాలోని జిగ్నా ప్రాంతానికి చెందిన మృతులను శివ సింగ్ (8), సోనమ్ సింగ్ (9), పియూష్ సింగ్ (14), పంకజ్ సింగ్ (40), వందన సింగ్ (43), విష్ణు సింగ్ (45), వీణ సింగ్ (47) గా గుర్తించారు. అలాగే, మధ్యప్రదేశ్లోని సత్నాకు చెందిన కార్తికేయ సింగ్ (18), ప్రియాంక సింగ్ (42), సాగర్కు చెందిన వికాస్ శర్మ (32), సోన్భద్ర జిల్లాకు చెందిన జై ప్రకాశ్ (27) ఉన్నారు. మృతదేహాలన్నింటినీ మార్చురీకి తరలించామని, బాధితుల కుటుంబాలకు సమాచారం అందించామని గంగ్వార్ పేర్కొన్నారు.
మరోవైపు, ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. "ఉత్తర్ప్రదేశ్లోని మీర్జాపుర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా" అని ముర్ము ఒక పోస్ట్లో పేర్కొన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >