రెండు గ్రాముల బంగారం, వెండితో నల్ల విజయ్ రూపొందించిన చీరను ఆవిష్కరించిన కేటీఆర్.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, "చేనేత కళారత్న" అవార్డు గ్రహీత నల్ల విజయ్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు, కేవలం రెండు గ్రాముల బంగారం మరియు రెండు గ్రాముల వెండిని ఉపయోగించి బంగారు, వెండి పూలతో కూడిన అత్యంత ఆకర్షణీయమైన చీరను రూపొందించారు. సుమారు 25 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి, ఐదున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దారు. బంగారు మరియు వెండి తీగలతో నేసిన ఈ చీరను మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా నల్ల విజయ్ మాట్లాడుతూ.. తనకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ప్రయోగాలు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. సుమారు 85 వేల రూపాయల వ్యయంతో రూపొందించిన ఈ చీర ప్రస్తుతం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందుతోందని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.