Posted on 2024-09-19 18:18:53
డైలీ భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైద్యం అందక పసిపిల్లలు చనిపోతున్నారంటే తమపైనే ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటుకు కొమ్ముకాస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేటీఆర్ ట్వీట్..
"వైద్యం అందటం లేదని... పసి పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు మహప్రభో అంటే బుదరజల్లుతున్నారు అని మాట్లాడతారా.. మీరు ఆరోపించినట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటుకు కొమ్ముకాయాలనుకుంటే... హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మాణం అవుతున్న పెద్దాసుపత్రులు, వరంగల్లో నడుస్తున్న అతిపెద్ద ఆసుపత్రి, బస్తీ దవాఖానాలు, గ్రామాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసే వాళ్లమా.. కేసీఆర్ కిట్లు, తల్లి-బిడ్డను ఇంటి దగ్గర దిగబెట్టేలా వాహనాలు, సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవటం, రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న చోట 33 మెడికల్ కాలేజీల ఏర్పాట్లు జరిగేవా.. మాపై ఎదురు దాడి తర్వాత, ముందుగా మీ పాలనలో ఉన్న లోపాలు సరిదిద్దుకోండి. పోయిన ప్రాణాలు తిరిగి రావు... ఆ తల్లుల కడుపుకోత తీర్చలేము. ప్రజలు కూడా మన బిడ్డలే అని మానవత్వంతో ఆలోచిస్తే మీ ఆలోచించే ధోరణితో పాటు మీ పాలన తీరు కూడా మారుతుంది. ఇప్పటికైనా మరణాలపై రివ్యూ చేశారా... నాణ్యమైన వైద్యం అందించేందుకు ఫోకస్ చేశారా... లేదా" అంటూ ప్రశ్నించారు.
"మొన్నటి బదిలీల్లో సీనియర్ డాక్టర్లను బదిలీపై పంపారన్న ఆరోపణల్లో వాస్తవం ఉందా... లేదా ఇది చెప్పండి. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ దర్యాప్తు చేస్తుంది. మేము మా పరిశోధనలను ప్రజలతో ప్రభుత్వంతో పంచుకుంటాము. ప్రభుత్వం కూడా ఈ ప్రయత్నాలలో పాలుపంచుకోవాలని ప్రతి ఒక్కరి అభివృద్ధికి కృషి చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. నివేదికల ప్రకారం, గాంధీ ఆసుపత్రి నుంచి అనుభవజ్ఞులైన వైద్యుల బదిలీలు జరిగాయి. మరణాల గురించి తగిన సమీక్షలు జరుగుతున్నాయో లేదో మాకు తెలియజేయండి.. మీరు మరణాన్ని సంఖ్యగా చూపేముందు గౌరవనీయమైన ఆరోగ్య మంత్రిని నేను అభ్యర్థిస్తున్నాను. ఒకరి బిడ్డ, ఒకరి తల్లి, మరొకరి భవిష్యత్తు, మరొకరి ప్రేమ గురించి మేము మాట్లాడుతున్నామని అర్థం చేసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >