Posted on 2026-07-20 15:13:02
డైలీ భారత్, తిరుపతి: అసలు నోట్లు ఇస్తే దానికి ఐదు రెట్లు ఎక్కువ మొత్తంలో బ్లాక్ మనీ లేదా నకిలీ నోట్లు ఇస్తామని నమ్మించి, అమాయకులను నిలువునా దోచుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును తిరుపతి జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారితో సహా ఐదుగురు నిందితులను పిచ్చాటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుపతికి చెందిన అజ్మీరా రాజారామ్ అనే వ్యక్తికి ఈ ముఠా ప్రధాన నిందితుడు ప్రకాష్ పరిచయమయ్యాడు. తన వద్ద రూ. 2 వేలు, రూ. 500 విలువైన బ్లాక్ మనీ నోట్లు ఉన్నాయని, ఒక అసలు నోటు ఇస్తే దానికి బదులుగా ఐదు రెట్లు ఎక్కువ కరెన్సీ ఇస్తానని రాజారామ్ను నమ్మించాడు. అతని మాటలు నమ్మి పిచ్చాటూరు వచ్చిన రాజారామ్కు ప్రకాష్ తన ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను చూపించాడు.
తీరా లోపలికి వెళ్లి చూసేసరికి అవి అసలు నోట్లు కావని, పిల్లలు ఆడుకునే "టాయ్ కరెన్సీ" (Toy Currency) అని బాధితుడు గుర్తించాడు. మోసాన్ని గ్రహించి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, ముఠా సభ్యులు ఒక్కసారిగా కత్తులతో రాజారామ్పై దాడికి దిగారు. చంపుతామని బెదిరించి అతని వద్ద ఉన్న రూ. 20,000 నగదును బలవంతంగా లాక్కున్నారు.
బాధితుడు రాజారామ్ ఇచ్చిన ఫిర్యాదుతో పిచ్చాటూరు పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో నిందితులు ఉన్నట్లు అందిన పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో ప్రధాన నిందితుడు ప్రకాష్తో పాటు మురళి, షేక్ అబ్దుల్ అక్రమ్, పల్లపు రవి కుమార్, కర్రేటి ప్రణయ్ ఉన్నారు. మరో నిందితుడు అశోక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నివాసాల నుంచి 50 కట్టల టాయ్ కరెన్సీ నోట్లను, రూ. 5,000 విలువైన నకిలీ నోట్లను, దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇలాంటి అంతర్రాష్ట్ర ముఠాలు తిరుపతి పరిసర ప్రాంతాల్లో గతంలోనూ యాక్టివ్గా ఉన్నాయని, ఏర్పేడు పరిధిలోనూ ఒక రూపాయికి మూడు రూపాయల నకిలీ నోట్లు ఇస్తామన్న ఆశతో ఇద్దరు అన్నదమ్ములు ఏకంగా రూ. 14 లక్షలు పోగొట్టుకున్నారని పోలీసులు గుర్తు చేశారు. తక్కువ డబ్బుకు ఎక్కువ కరెన్సీ ఇస్తామనే మోసపూరిత ఆఫర్లను నమ్మి ప్రజలు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని తిరుపతి జిల్లా పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
సిక్కిం : కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
Posted On 2026-07-21 06:12:30
Readmore >
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
Posted On 2026-07-21 04:16:53
Readmore >
తరగతులకు రోజూ హాజరుకావాలి.. ప్రణాళిక ప్రకారం చదవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-20 17:26:49
Readmore >
శబరిమల బంగారు దోపిడీ కేసులో తుది నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలి...
Posted On 2026-07-20 16:40:30
Readmore >
బ్యాంకుల్లో ఆకస్మిక తనిఖీలు... ప్రజల భద్రతే లక్ష్యంగా బాన్సువాడ పోలీసులు
Posted On 2026-07-20 16:14:17
Readmore >