Posted on 2026-05-15 19:40:30
డైలీ భారత్, కామారెడ్డి: మతిస్థిమితం కోల్పోయి 24 సంవత్సరాల క్రితం తప్పిపోయిన వృద్ధుడిని కుటుంబ సభ్యులకు అప్పగించిన కామారెడ్డి పోలీసులు
మానవత్వానికి నిదర్శనంగా కామారెడ్డి టౌన్ పోలీసులు మతిస్థిమితం కోల్పోయి 24 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యుల నుంచి దూరమైన ఓ వృద్ధుడిని గుర్తించి, అతని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా, పుటన్పల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ (65) మతిస్థిమితం సరిగా లేకపోవడంతో సుమారు 24 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి కుటుంబ సభ్యులకు కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ వచ్చారు.
గురువారం రాత్రి సాధారణ తనిఖీల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అశోక్ మరియు హోంగార్డ్ రవి కామారెడ్డి పట్టణంలో సత్యనారాయణను గుర్తించి, అతని వద్ద నుంచి పూర్తి వివరాలను సేకరించారు. అనంతరం ఆ సమాచారాన్ని కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్కు అందజేశారు.
కామారెడ్డి పోలీసులు వెంటనే జోగులాంబ గద్వాల్ జిల్లా పోలీసులను సంప్రదించగా, వారు పుటన్పల్లి గ్రామంలో విచారణ జరిపి, సత్యనారాయణ నిజంగానే 24 సంవత్సరాల క్రితం తప్పిపోయిన వ్యక్తేనని నిర్ధారించారు. అనంతరం ఆయన కుమారులు శివశంకర్ మరియు జ్ఞానచారి (గణేష్)ను కామారెడ్డికి పంపించారు.
శుక్రవారం ఉదయం కామారెడ్డి టౌన్ సీఐ శ్రీ నరహరి సమక్షంలో సత్యనారాయణను ఆయన కుమారులకు అప్పగించారు. తండ్రిని ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకున్న కుమారులు భావోద్వేగానికి గురై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సేవలో కీలక పాత్ర పోషించిన పోలీస్ కానిస్టేబుల్ అశోక్, హోంగార్డ్ రవి, పీసీ కమలాకర్ రెడ్డిని, పట్టణ సీఐ నరహరిని జిల్లా ఎస్పీ అభినందించారు.
ప్రజల పట్ల సేవాభావంతో, మానవత్వంతో స్పందిస్తూ కామారెడ్డి పోలీసులు మరోసారి ఆదర్శంగా నిలిచారు.
64 లక్షల విలువ చేసే 128 కేజీల గంజాయి పట్టుకున్న వైరా పోలీసులు
Posted On 2026-05-15 20:17:21
Readmore >
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరైన డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-05-15 20:09:22
Readmore >