Posted on 2026-05-12 19:30:43
డబ్బుల కోసం కూలీ కార్మికుడిని హత్య చేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్
టెక్నికల్ ఆధారాలతో 48 గంటల్లో కేసు ఛేదించి ప్రెస్ మీట్ లో వెల్లడించిన షాద్నగర్ పోలీసులు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని షాద్నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం కూలీ కార్మికుడిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట్ మండలం పోమాల్ గ్రామానికి చెందిన పల్లె కేశవులు (39) షాబాద్ మండలం సర్దార్నగర్లోని శ్రీనివాసరావు ఫామ్ హౌస్లో కూలీగా పని చేస్తూ కుటుంబంతో నివసిస్తున్నాడు. భూమి వివాదం విషయంలో మాట్లాడేందుకు మే 9న తన యజమాని వద్ద నుంచి రూ.50 వేల అప్పుగా తీసుకుని పరిగికి వెళ్లాడు. అక్కడ తన అన్నదమ్ములతో కలిసి భూమి సమస్యపై చర్చించి, తిరిగి షాద్నగర్కు చేరుకున్నాడు.
ఆ రాత్రి షాద్నగర్ బస్టాండ్ సమీపంలోని వైన్ షాప్ వద్ద మద్యం సేవిస్తున్న సమయంలో పుల్లగోయి బజరన్నతో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో కేశవుల వద్ద నగదు ఉన్న విషయం గమనించిన బజరన్న డబ్బులు దోచుకోవాలని యోచించాడు. అనంతరం బైన్ల యాదమ్మ సహకారంతో కేశవులను వీర్లపల్లి రోడ్డులోని SRR వెంచర్ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశాడు. ఘటనలో కేశవులు అక్కడికక్కడే మృతి చెందగా, నిందితులు నగదు తీసుకుని పరారయ్యారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన షాద్నగర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టి మే 12న నిందితులు పుల్లగోయి బజరన్న, బైన్ల యాదమ్మలను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి రూ.3,900 నగదు, హోండా షైన్ బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ రిమాండ్కు తరలించారు.
ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి, షాద్నగర్ డీసీపీ సీహెచ్ శిరీష, ఏసీపీ ఎస్ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. సీతారాం నేతృత్వంలో ప్రత్యేక బృందం ఈ కేసును ఛేదించింది. కేసు ఛేదనలో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
పాపకొల్లు గ్రామంలోప్రవీణ్ నిమ్మటూరి షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
Posted On 2026-05-12 19:21:38
Readmore >
మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి : జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత...
Posted On 2026-05-12 19:11:46
Readmore >