Posted on 2026-04-19 22:25:03
గ్రామసభలు కాగితం మీదే,హక్కులు గాలిలోనే అవగాహన లేకుండా నిధులు వృథా
అధికారుల నిర్లక్ష్యం, నాయకుల రాజకీయాల మధ్య షెడ్యూల్ ప్రాంతాల భవిష్యత్ ప్రశ్నార్థకం!
మూడు దశాబ్దాలు అవుతున్న హక్కుల పై అవగాహన లేని ఆదివాసులు!
అందినకాడికి దోచుకుంటున్న అక్రమార్కులు, అధికారులు వంత పాడుతుకున్న సొసైటీలు!
పెసా గ్రామసభల పై అవగాహన చెయ్యాల్సిన పెసా మోబిలైజర్స్, సంతకాలకే పరిమితం
గ్రామసభల కోసం ప్రశ్నించిన వారి పై ఎదురుతిరుగుతున్న పంచాయతి కార్యదర్శులు, ఉన్నతాధికారులు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీల స్వయం పాలనకు బలమై ఉండాల్సిన పీసా (PESA) చట్టం అమలు కేవలం పేరుకే మిగిలిపోయిందని, చట్టం అమలై దాదాపు మూడు దశాబ్దాలు కావస్తున్నా అమలులో వెనుకబడి పొయింది అని, , ఆదివాసీ స్వయంపాలన కేంద్రంగా ఉండాల్సిన గ్రామసలు, వాస్తవంలో మాత్రం గ్రామస్థాయిలో సరైన అవగాహన లేకపోవడంతో బలహీనమైందని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆదివాసీ ప్రజల్లో తమ హక్కులపై సరైన అవగాహన లేకపోవడం పరిస్థితి తీవ్రతనూ అర్ధం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, ప్రతి గ్రామపంచాయతికి గ్రామసభలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా పీసా మొబిలైజర్స్ కూ , గ్రామసభ నిర్వహణ కోసం నిధులు విడుదల చేస్తుంది.
ఈ క్రమంలో నూతన తెలంగాణ పంచాయతి రాజ్ చట్టం ప్రకారం , గతంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ప్రకటించిన పెసా గ్రామాల వారిగా పెసా ఉపాధక్ష్యులు, కార్యదర్శి ఎన్నిక కోసం ప్రాజెక్ట్ అధికారి గారి ఆదేశాలతో, డిప్యూటీ తహసిల్దార్ హోదాకి తక్కువ కానీ అధికారులని గ్రామసభలకూ కేటాయించి, పెసా ద్వారా సంక్రమించిన హక్కులు, అధికారాలను తెలియజేయటంలో జిల్లా కో ఆర్డినేటర్ , మండల , జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో పని చేసినారు.
గ్రామసభ కమిటిల ఎన్నిక అనంతరం, వారికీ అందుబాటులో వుంటూ, గ్రామసభలపై అవగాహన కల్పించాల్సిన పీసా మొబిలైజర్స్ సేవలు మాత్రం పూర్తిగా శూన్యంగా మారాయి, గ్రామాల్లో ప్రజలకు చట్టం గురించి తెలియజేయాల్సిన వారు తమ బాధ్యతను నిర్వర్తించకపోవడంతో పాటు, అమలు కోసం గతంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లాలో ఇచ్చిన శిక్షణలు కూడా వృధాగా మారాయి, పీసా గ్రామసభల అసలు ఉద్దేశ్యం ప్రజలకు చేరడం లేదు. ఫలితంగా గ్రామసభలు కేవలం కాగితాలపై నిర్వహించబడుతున్న కార్యక్రమాలుగా మిగిలిపోతున్నాయి. ఇది ఇలా వుంటే, చట్ట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న పంచాయతి కార్యదర్శులు, మండల, జిల్లా స్థాయి అధికారులు కూడా స్వతహాగా పెసా అమలు కోసం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు.
ముఖ్యంగా పెసా చట్టం ద్వారా 100% వంద శాతం రిజర్వేషన్ తో సర్పంచ్, 50% శాతం వార్డ్ మెంబర్, ఎమ్పిటిసి స్థానాల కోసం పదవుల కోసం ఆరాటపడుతున్న ఆదివాసులు, వారికీ వెనక వుండి జనరల్ స్థానాలలో పోటి చేస్తున్న గిరిజనేతరులు , పెసా చట్టంలో గల లొసుగులు అడ్డం పెట్టుకొని, గిరిజనుల మధ్య గొడవలు సైతం పెడుతున్నారు. రాజకీయ పదవుల కోసం నాయకుల మధ్య జరుగుతున్న పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, పీసా అమలు విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఎలాంటి చురుకుదనం కనిపించడం లేదు. పీసా గ్రామసభలు నిర్వహించాల్సిన చోట, సాధారణ గ్రామసభలు నిర్వహించడం ద్వారా చట్టపరమైన విధానాలు పక్కన పెట్టబడుతున్నాయి. ఇలా చేయడం పీసా చట్టం యొక్క అసలు ఆత్మను పూర్తిగా దెబ్బతీస్తోంది.
కొన్ని సందర్భాల్లో ఇసుక, మద్యం దుకాణాల అనుమతుల కోసం మాత్రమే మొక్కుబడిగా గ్రామసభలు నిర్వహించడం జరుగుతోంది. ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, ప్రభుత్వ పనులు పూర్తిచేసుకునేందుకు మాత్రమే ఈ సమావేశాలు వేదికలుగా మారుతున్నాయి. కొన్ని చోట్ల పెసా చట్టం కోసం అవగాహన ఉన్న యువత, మహిళలు గ్రామసభల గురించి ప్రశ్నిస్తున్న సమయంలో, వారిపై పంచాయతి కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఎదురు తిరుగుతున్నారని, అవహేలనగా మాట్లాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు కొంతమంది అవగాహన ఉన్న ఆదివాసీ నాయకులు, కొందరు విలేకరులు చట్టం పేరు చెప్పి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. అందులో అధికారులకి కూడా వాటా వుందని బహిరంగంగా వినిపిస్తుంది.
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చదువుకున్న పట్టభద్రులు సైతం పీసా, అటవీ హక్కుల చట్టం, భూ బదలాయింపు నిషేధిత చట్టం వంటి కీలక చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం, విద్య ఉన్నప్పటికీ చట్టాలపై అవగాహన లేకపోవడం, వారు గ్రామసభలకి హాజరు కాకపోవడం, గ్రామ సమస్యల పరిష్కారం గ్రామపంచాయతిది అని మాత్రమే భావిస్తున్నారంటే ఈ సమస్య ఎంత లోతుగా వేరుకట్టుకుందో సూచిస్తోంది.
ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించడం కూడా తప్పుగా భావించే పరిస్థితి నెలకొనడం ఆందోళనకరమని, ప్రజల అజ్ఞానాన్ని ఉపయోగించుకొని తమ స్వార్థ ప్రయోజనాలను సాధించుకోవడం వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని, ఆదివాసులకి అధికారం కల్పించిన చట్టం, అధికారులకి జేబులు నింపుకోవడానికి చుట్టంగా మారిందని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు “బూడిదలో పోసిన పన్నీరు”లా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, పెసా మోబిలైజర్స్, గ్రామసభలకి కి కేటాయిస్తున్న నిధులు నేరుగా గ్రామసభ యొక్క ప్రత్యేక ఖాతాలో జమచేయడంతో పాటు, పెసా కమిటికి గౌరవవేతనంగా ఇస్తే పెసా గ్రామసభలకి ఆర్ధిక చేయూత దొరకడంతో పాటు, నిధులపై పర్యవేక్షణ ఉంటుందని ఆదివాసీ సంఘాల నాయకులు, మేధావులు, పెసా పట్ల అనుభవం ఉన్న స్వచ్చంద సంస్థలు కోరుతున్నాయి.
పీసా చట్టం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, అమలయ్యేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, ఎన్నికైన కమిటీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా భాద్యతగా పని చేస్తూ, పారదర్శక పాలన చెయ్యాలి, అవసరమైన నిధులు పెసా గ్రామసభలకి అందించాలి, అవగాహన పెంపు, పారదర్శకత, కట్టుదిట్టమైన అమలు లేకపోతే ఆదివాసీల స్వయం పాలన ఒక కలగానే మిగిలిపోతుంది.
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >