డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న రహదారి భద్రత వారోత్సవాల్లో “అర్రైవ్ అ లైవ్” కార్యక్రమం కింద దమ్మపేటలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మరియు జిల్లాలో జరుగుతున్న రహదారి ప్రమాదాలు, వాటి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. గుడ్ సమారిటన్ విధానం, పీఎం అర్హత్ పథకం గురించి వివరించారు.
ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సైబర్ మోసాలు మరియు రహదారి ప్రమాదాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రహదారి ప్రమాదాల్లో ప్రాణ నష్టం కుటుంబాలకు తీవ్రమైన దెబ్బ అని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ వినియోగించకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. గ్రామసభల ద్వారా రహదారి భద్రతపై తీర్మానాలు తీసుకోవాలని సూచించారు.