డైలీ భారత్, మహారాష్ట్ర:మహారాష్ట్ర రాష్ట్రంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. సతారా జిల్లాలో పనిచేస్తున్న ఓ మహిళా వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, ఆమె తన అరచేతిపై సూసైడ్ నోట్ రాయడం ఈ ఘటనను మరింత సంచలనంగా మార్చింది. ఆ నోట్లో ఆమెను గత ఐదు నెలలుగా ఓ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పలుమార్లు లైంగికంగా వేధించాడని, నాలుగు సార్లు అత్యాచారం చేశాడని పేర్కొన్నారు.
ఫల్టన్ సబ్జిల్లా ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఈ వైద్యురాలు, సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బద్నే తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని రాసి ఉంచారు. పోలీసులు నిరంతరం వేధిస్తుండటంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె నోట్లో స్పష్టం చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం రేపింది.
ఆత్మహత్య ముందు వైద్యురాలు జూన్ 19న డీఎస్పీకి లేఖ రాసి, తనపై జరుగుతున్న వేధింపుల గురించి వివరించారు. ఫల్టన్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ముగ్గురు అధికారులను బద్నే, పాటిల్, లద్పుత్రే తమపై వేధింపులు చేశారని ఆమె లేఖలో పేర్కొన్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ బద్నేను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు పోలీసు వ్యవస్థను తీవ్రంగా విమర్శిస్తూ, మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.