Posted on 2025-07-26 13:37:03
విద్యారంగం మాదిరిగానే వైద్యరంగంలో సైతం మరింత మెరుగైన వైద్య చికిత్స అందించడమే ప్రభుత్వ సంకల్పం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శనివారం బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. అంతకుముందు కలెక్టర్ మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్), క్రిటికల్ కేర్ యూనిట్ లతో కూడిన భవన సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం జీజీహెచ్ లో ఆసుపత్రి పనితీరుపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్ష జరిపారు. ఒక్కో విభాగం వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంకనూ కొత్తగా సమకూర్చాల్సిన సదుపాయాలు తదితర వాటి గురించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలను మరింతగా మెరుగుపర్చాలని, అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తామని సూచించారు. వివిధ వైద్య సేవల కోసం ప్రతిరోజు 1800 నుండి 2000 మంది వరకు అవుట్ పేషంట్ రోగులు జీజీహెచ్ కు వస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని విభాగాల పనితీరు మెరుగుపడేలా చూడాలన్నారు. అన్ని విభాగాలలో 180 మంది వైద్యులు, సరిపడా సిబ్బందితో పాటు అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు జీజీహెచ్ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మేజర్, మైనర్ సర్జరీలతో పాటు షుగర్, బీపీ, డెంగ్యూ, మలేరియా, థైరాయిడ్ వంటి వ్యాధి నిర్ధారణ టెస్టులు ఉచితంగా చేస్తారని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వీటికి వేల రూపాయల రుసుము వసూలు చేస్తారని అన్నారు. అన్ని విభాగాలలో ప్రైవేట్ తో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిపుణులైన వైద్యులు, వారికి అనుబంధంగా మెడికోలు ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జీజీహెచ్ లో కీలు మార్పిడి శాస్త్ర చికిత్సలు నిర్వహిస్తుండడం జరుగుతోందని, డెంటల్ విభాగం ఆధ్వర్యంలో ఎంతో ఖర్చుతో కూడుకుని ఉన్న సర్జరీలను కూడా స్థానికంగా చేస్తున్నారని అన్నారు. విద్యారంగం తరహాలోనే వైద్య రంగం పని తీరును మరింతగా మెరుగుపర్చాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ మేరకు ఆసుపత్రికి అవసరమైన ఆధునాతన వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయిస్తామని అన్నారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థను, టాయిలెట్లను చక్కదిద్దాలని, లీకేజీలను అరికట్టాలని, ఫ్లోరింగ్, ఆసుపత్రి ముందుభాగంలో కిటికీల అద్దాలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, నెల రోజుల లోపు పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులకు గడువు విధించారు. పదిహేను సంవత్సరాల క్రితం నిర్మించిన ఆసుపత్రి కావడం వల్ల నిర్వహణ పరమైన లోపాలను కూడా చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జీజీహెచ్ తో పాటు బోధన్, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొని ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు
Posted On 2026-07-24 13:53:56
Readmore >
పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం
Posted On 2026-07-24 09:13:16
Readmore >
కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం
Posted On 2026-07-24 09:09:28
Readmore >
జూలూరుపాడు మండలంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
Posted On 2026-07-24 09:02:05
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ బాక్స్ కల్వర్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Posted On 2026-07-24 09:00:44
Readmore >
వంశీ ఆత్మహత్య ఘటన బాధాకరం : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
Posted On 2026-07-24 04:25:46
Readmore >