Posted on 2026-06-18 17:17:25
స్టేషన్ పరిసరాలు, రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలన.
ప్రతి కేసు వివరాలను సీసీటీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశం.
నేర నియంత్రణే లక్ష్యం.. రౌడీ షీటర్లు, కేడీలపై ప్రత్యేక దృష్టి
ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి సత్వర న్యాయం అందించాలని సూచన.
జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గురువారం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ తనిఖీల్లో భాగంగా స్టేషన్ పరిసరాలు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ మరియు సిబ్బంది పనితీరును ఆయన నిశితంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై రోల్ కాల్ ప్రాముఖ్యతను వివరించడంతో పాటు, వారు నిర్వహిస్తున్న విధులు, బాధ్యతలపై ఆరా తీశారు.
స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఎస్పీ గారు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులోనూ నాణ్యమైన దర్యాప్తు జరగాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, దాన్ని పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే, స్టేషన్కు సంబంధించిన అన్ని రికార్డులను నిర్ణీత గడువులోగా సీసీటీఎన్ఎస్ (CCTNS) పోర్టల్లో నమోదు చేసి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ను ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణపై స్పందిస్తూ.. పట్టణంలో వాహనాల తనిఖీలు, నాకాబందీలు, ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తులు, వాహనాలపై గట్టి నిఘా ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, కేడీలు, పాత నేరస్థుల వివరాలపై ప్రతి సిబ్బందికీ పూర్తి అవగాహన ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు. పగలు, రాత్రి సమయాల్లో బీట్లను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఆన్లైన్ రికార్డులను అప్డేట్ చేయాలన్నారు. వీటితో పాటు సైబర్ నేరాలు, ఆస్తి నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రత వంటి కీలకమైన అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
సిబ్బందిని ఉద్దేశించి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, వృత్తిపరమైన నైపుణ్యంతో పనిచేయాలని సూచించారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించాలని స్పష్టం చేశారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా విని, చట్టబద్ధంగా సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ, ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణే కామారెడ్డి పోలీసుల ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. నేర రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, పోలీసులకు సహకరిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని కోరారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని లింకులు, ఫోన్ కాల్స్, ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి సమస్య ఎదురైనా తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని, వారి రక్షణకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
“మీ భద్రత – మా బాధ్యత” అనే నినాదంతో ప్రజలకు మరింత చేరువగా, మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు కామారెడ్డి పోలీసులు కట్టుబడి ఉన్నారని ఎస్పీ పేర్కొన్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >