డైలీ భారత్, కామారెడ్డి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభల్లో కామారెడ్డి జిల్లా పోలీసులు “Arrive Alive – క్షేమంగా ఇంటికి చేరండి” కార్యక్రమం ద్వారా ప్రజలకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించి ప్రాణాలను కాపాడవచ్చని సూచిస్తున్నారు.
ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని తెలిపారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనం నడపరాదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని, అతివేగం మరియు నిర్లక్ష్య డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని ప్రజలకు వివరించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించవచ్చని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS మాట్లాడుతూ, “గమ్యానికి చేరుకోవడం కంటే క్షేమంగా చేరుకోవడమే ముఖ్యం. మీ కోసం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా ప్రయాణించాలి” అని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొంటూ, సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.