Posted on 2026-05-26 07:43:54
గోదావరి కాలుష్య నివారణకు అంతర్జిల్లా టాస్క్ఫోర్స్ ఏర్పాటు
కాలుష్య నియంత్రణ చర్యలకు రూ.100 కోట్ల ప్రత్యేక బడ్జెట్
ఆరు నెలల్లో నదిలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆదేశం
ప్లాస్టిక్ రహిత గోదావరి పుష్కరాలే లక్ష్యం
హడావుడి పనులతో భక్తుల ప్రాణాలతో చెలగాటమొద్దని హెచ్చరిక.
డైలీ భారత్, ఆంధ్రప్రదేశ్: ‘మన దాహం తీర్చి, మనకు జీవం ఇచ్చే పవిత్రమైన జీవ నదులను మనమే చేతులారా చంపేస్తూ మృత నదులుగా మారుస్తున్నాం’ అని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి Pawan Kalyan ఆవేదన వ్యక్తం చేశారు. నదుల పట్ల నిర్లక్ష్యం కొనసాగితే భవిష్యత్తు తరాలకు తాగునీరు కూడా దొరకని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
సోమవారం రాజమహేంద్రవరంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కాలుష్య నివారణ కోసం ప్రత్యేక అంతర్శాఖల (జిల్లా) టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి, శాశ్వత పరిష్కారాలు సూచించేలా ఈ టాస్క్ఫోర్స్ పనిచేయాలని తెలిపారు.
నదిలోకి చేరుతున్న మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలపై వెంటనే ‘పొల్యూషన్ ఆడిట్’ నిర్వహించాలని, కీలక ప్రాంతాల నుంచి నీటి నమూనాలు సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపాలని సూచించారు. “మిషన్ ఫర్ క్లీన్ గోదావరి కేవలం బోర్డులకే పరిమితం కాకూడదు” అంటూ క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పుష్కరాల ఏర్పాట్లలో హడావుడిగా పనులు చేసి భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు. నాణ్యతలేని ఘాట్లు, తాత్కాలిక నిర్మాణాలు ప్రమాదాలకు దారితీస్తాయని గుర్తుచేశారు. “భక్తులు మురికి నీళ్లలో స్నానం చేసి వెళ్లాం అనే భావన కలగకూడదు” అని అన్నారు.
గోదావరి పుష్కరాలు కేవలం రాజమహేంద్రవరానికే పరిమితం కాకుండా, గోదావరి ప్రవహించే ఆరు జిల్లాల పంచాయతీలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. గత పుష్కరాలకు 4.6 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని, ఈసారి దాదాపు 10 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పుష్కరాలను దేశం గర్వపడేలా ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. గోదావరి ప్రవహించే ఆరు జిల్లాల్లో ఏడాదిపాటు ప్లాస్టిక్ వినియోగంపై కఠిన నియంత్రణలు అమలు చేయాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిర్మూలించేలా ప్రత్యేక ఎన్విరాన్మెంటల్ టాస్క్ఫోర్స్ పనిచేయాలని ఆదేశించారు.
కాలుష్య నియంత్రణ చర్యల కోసం కాలుష్య నియంత్రణ మండలి ద్వారా రూ.100 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పరిశ్రమల నుంచి నదిలో కలుస్తున్న రసాయన వ్యర్థాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు.
పుష్కరాల కోసం గోదావరి తీర ప్రాంతాల్లోని 285 గ్రామ పంచాయతీలను గుర్తించినట్లు వెల్లడించారు. అక్కడ ఘాట్లు అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రాంతాల్లో ‘హోం స్టే’ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగి గ్రామాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని తెలిపారు.
“జీవ నది మన తల్లి లాంటిది. దాన్ని కలుషితం చేస్తే మన భవిష్యత్తునే మనమే నాశనం చేసుకున్నట్టే” అని పేర్కొంటూ, ప్రజలందరూ ‘ప్లాస్టిక్ ఫ్రీ గోదావరి’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >