Posted on 2026-05-24 07:43:22
జూన్ 12 నుంచి తెలంగాణలో ఉద్యోగుల “పెన్డౌన్” మహా ఉద్యమం
మాజీ ఏపీ బీసీసీ చైర్మన్ బక్క జడ్సన్, అడ్వకేట్ కోటగిరి అశోక్ కుమార్
డైలీ భారత్, ఖమ్మం: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం జూన్ 12 నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ స్థాయిలో “పెన్డౌన్” ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు మాజీ ఏపీ బీసీసీ చైర్మన్ బక్క జడ్సన్, అడ్వకేట్ కోటగిరి అశోక్ కుమార్ ప్రకటించారు. ఖమ్మం గట్టయ్య సెంటర్లోని జిల్లా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కొనసాగిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఇక సహించబోమని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు.
బక్క జడ్సన్ మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడిలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన వేలాది మంది ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికీ పూర్తిగా అందకపోవడం దురదృష్టకరమన్నారు. పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.అడ్వకేట్ కోటగిరి అశోక్ కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడిందన్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కనీస వేతన భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అందించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం నుంచే రాష్ట్రవ్యాప్త పోరాటానికి శంఖారావం పూరించిన ఈ సమావేశం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే “పెన్డౌన్” ఉద్యమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ఉద్యోగులు, ప్రజా సంఘాలు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం
Posted On 2026-05-24 21:12:46
Readmore >
ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Posted On 2026-05-24 12:27:09
Readmore >
వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు
Posted On 2026-05-24 11:06:50
Readmore >
మున్సిపల్ లోని శానిటైజేషన్, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగం అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
Posted On 2026-05-24 07:52:01
Readmore >