Posted on 2026-05-12 19:17:14
ప్రశ్నాపత్రం లీక్ కలకలం.. సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశాలు
డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారికంగా రద్దు చేసింది. రాజస్థాన్లో ప్రశ్నాపత్రం లీక్ జరిగినట్లు వెలుగులోకి రావడంతో పాటు, పరీక్షకు ముందే విద్యార్థుల మధ్య చక్కర్లు కొట్టిన “గెస్ పేపర్”లోని ప్రశ్నలు అసలు ప్రశ్నాపత్రంతో భారీ స్థాయిలో సరిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పరీక్షకు 48 గంటల ముందే కొందరు విద్యార్థులకు అందించిన ప్రాక్టీస్ పేపర్లోని 100కు పైగా ప్రశ్నలు అసలు నీట్ ప్రశ్నాపత్రంతో మ్యాచ్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఇవి దాదాపు 600 మార్కులకు సంబంధించిన ప్రశ్నలని సమాచారం.
ఈ వ్యవహారం మొదట రాజస్థాన్లో వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ ద్వారా “ఫార్వర్డ్ మెనీ టైమ్స్”గా షేర్ అయిన గెస్ పేపర్పై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) దర్యాప్తు చేపట్టగా, అనేక రాష్ట్రాలకు ఈ లీక్ నెట్వర్క్ విస్తరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
22 లక్షలకుపైగా విద్యార్థులు హాజరైన ఈ పరీక్ష రద్దుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి. పరీక్షా వ్యవస్థపై నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరీక్ష పారదర్శకతను కాపాడేందుకే రద్దు నిర్ణయం తీసుకున్నామని ఎన్టీఏ వెల్లడించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, మరోసారి నిర్వహించే నీట్ పరీక్షకు ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయబోమని, కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది.
పాపకొల్లు గ్రామంలోప్రవీణ్ నిమ్మటూరి షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
Posted On 2026-05-12 19:21:38
Readmore >
మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి : జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత...
Posted On 2026-05-12 19:11:46
Readmore >