PIT NDPS చట్టం కింద నిందితుడి నిర్బంధం
డైలీ భారత్, అనకాపల్లి (రోలుగుంట): జిల్లాలో గంజాయి విక్రయాలు మరియు రవాణాను పూర్తిగా నిర్మూలించాలన్న జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐ.పి.ఎస్., అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీమతి ఎం.శ్రావణి వారి కఠిన ఆదేశాల మేరకు, వరుస నేరాలకు పాల్పడుతున్న ఒక నిందితుడిపై PIT NDPS (Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances) చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రోలుగుంట మండలం, బెన్న భూపాలపట్నం గ్రామానికి చెందిన ఐతిరెడ్డి అశోక్ (30) అనే వ్యక్తి గత కొంతకాలంగా అల్యూరి సీతారామరాజు జిల్లా నుండి అనకాపల్లి మరియు ఇతర ప్రాంతాలకు అక్రమంగా గంజాయిని తరలిస్తూ Habitual Offender (వరుస నేరస్థుడు)గా మారాడు. ఇతనిపై గతంలో రోలుగుంట మరియు ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్లలో భారీ మొత్తంలో గంజాయి తరలిస్తూ పట్టుబడిన పలు కేసులు నమోదై ఉన్నాయి.
జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ నిందితుని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, సమాజంపై మరియు ప్రజారోగ్యంపై ఇతని కార్యకలాపాల దుష్ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎస్పీ గారి ఆదేశాలతో ఇతనిపై PIT NDPS చట్టం-1988 కింద ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
ఈ ఆపరేషన్లో కొత్తకోట సిఐ జి.కోటేశ్వరరావు, NDPS సెల్ ఇన్స్పెక్టర్ పిల్లా రమేష్, రోలుగుంట ఎస్సై పి.రామకృష్ణారావు మరియు వారి సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని, పకడ్బందీగా జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి వ్యాపారానికి పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని, చట్టాన్ని అతిక్రమించే వారిపై ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా పదేపదే నేరాలకు పాల్పడే వారిపై ఇలాంటి కఠినమైన చట్టాలను ప్రయోగిస్తామని స్పష్టం చేశారు.
#AndhraPradeshStatePolice #anakapallipolice #anakapallidistrict#Andhra Pradesh Police