Posted on 2026-01-11 21:17:28
కరోనా మహమ్మారి అనంతరం ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి
డైలీ భారత్, నిజామాబాద్:వాకింగ్ చేయడం సర్వరోగ నివారిణి అని ప్రతిరోజు తమతమ దిన చర్యలో అరగంటసేపు వాకింగ్కు సమయం కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవగాహన పెరిగిందని అందుకే ఇదివరకంటే అంటే కరోనా రాక ముందు కంటే ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా తమ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం వాకింగ్, వ్యాయామం లాంటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నారని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ ప్రాంతం, పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం NUDA ఫండ్స్ ద్వారా మంజూరైన రూ.9 లక్షల నిధులతో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్కు సంబంధించి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,
వాకింగ్ అనేది సర్వరోగ నివారిణి అని, ఏ వృత్తుల వారైనా, వ్యాపారవేతలైన, రాజకీయ నేతలైనప్పటికీ వారి వారి నిత్యజీవితంలో వివిధ రకాల బిజి షెడ్యూల్ ఉన్నప్పటికీ వాకింగ్ కొరకు ప్రతి రోజు కనీసం అరగంట వాకింగ్ చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని తెలిపారు. ముఖ్యంగా కరోనా తరువాత ప్రజలు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. పాలిటెక్నిక్ మైదానానికి ప్రతిరోజూ 5 వేల నుంచి 10 వేల మంది వరకు వాకింగ్ కోసం వస్తుంటారని, అలాంటి వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాకింగ్ ట్రాక్ నిర్మాణం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే గత 12 సంవత్సరాలుగా నిరంతరం వాకింగ్కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అశోక్ అని ఎక్స్ సర్వీస్ మాన్ తన శక్తి మేరకు సహకరిస్తున్నారని అది తన దృష్టికి వచ్చిందని, ఆరోగ్యంపై ఉన్న అవగాహనతో ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే గారు కొనియాడారు. ప్రభుత్వం ద్వారా రూ.9 లక్షల నూడ నిధులు మంజూరైనప్పటికీ, అవి సరిపోకపోతే తన వంతుగా ఉడతా భక్తిగా సహాయం చేసి, శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలతో వాకింగ్ ట్రాక్ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అదేవిధంగా జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, సరైన కోచింగ్ లేకున్నా జిల్లాకు చెందిన ఎంతో మంది క్రీడాకారులు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. అదే మన జిల్లా క్రీడాకారులకు ఉన్న గొప్పతనం అని ఆయన అన్నారు. పాత కలెక్టరేట్ మైదానం, నగరంలోని స్టేడియంలు, ఇతర క్రీడా మైదానాలను అభివృద్ధి చేసి ఇందూరు క్రీడాకారుల ప్రతిభను దేశవ్యాప్తంగా చాటిచెప్పాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నూడ చైర్మన్ కేశవేణు, వాకింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ రామకృష్ణ వైదికధర్మ పీఠం వేద పాఠశాల లో సామూహిక ఉపనయన కార్యక్రమం
Posted On 2026-03-08 21:43:35
Readmore >