అర్బన్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి
సమీక్షా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఇటీవల టి యు ఎఫ్ ఐ డి సి ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించేందుకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సుభాష్ నగర్ లోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడుతూ నగరంలోని రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, టి యు ఎఫ్ ఐ డి సి ద్వారా చేపడుతున్న పనుల నాణ్యత, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై ఎమ్మెల్యే అధికారులతో విస్తృతంగా సమీక్షించారు. నిజామాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దే బాధ్యత అర్బన్ నియోజకవర్గానికి చెందిన ప్రతి ఒక్క అధికారి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా తన నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఎలాంటి జాప్యం వహించిన సహించేది లేదని అధికారులకు సూచించారు.
ప్రజావసరాలకు నిత్యం ప్రాధాన్యతనిస్తూ పారదర్శకంగా పనులు చేపట్టాలని, నిర్ణీత గడువుల్లో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి నిజామాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, మున్సిపల్ ఈ.ఈ సుదర్శన్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ డి ఈ ప్రవీణ్, పబ్లిక్ హెల్త్ అధికారి డి ఈ నాగేశ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ అధికారి ఏఈ శివకృష్ణ తదితర మున్సిపల్, ఆర్ అండ్ బి, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులు పాల్గొన్నారు.