అధిక సంఖ్యలో హాజరైన ముస్లిం సోదరులు, సీనియర్ నాయకులు
ప్రముఖ వక్త బ్రదర్ షఫీ
పటాన్ చెరు, డైలీ భారత్ న్యూస్: మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. కులం మతం ప్రాంతాలకు అతీతంగా పరమత సహనం పెంపొందిస్తున్నామని తెలిపారు. ముస్లింల అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.. సొంత నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా మసీదులు, అశీర్ఖనాలు నిర్మించడం జరిగిందని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వక్త, బ్రదర్ షఫీ పరమత సహనంపై ప్రత్యేకంగా బోధనలు చేశారు. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని.. కష్టనష్టాలలో ఒకరికొకరు అండగా నిలవాలని కోరారు. ప్రపంచంలోనే భారతదేశం విభిన్నమైనదని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ముస్లింలకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు..
అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, విందు భోజనాలు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్, నియోజకవర్గ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.