రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మరణ వార్తతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : రామోజీరావు అంత్యక్రియల్లో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. అక్షరయోధుడి పాడెను మోశారు. ఈ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఫిల్మ్సిటీలోని నివాసం నుంచి మొదలైన అంతిమయాత్ర రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయమీదుగా సాగి స్మారక కట్టడం వద్దకు చేరింది. స్మృతి వనం దగ్గర నివాళులు అర్పించిన అనంతరం చంద్రబాబు.. రామోజీ పాడెను మోశారు. కన్నీరు పెట్టుకున్నారు. ఆయన కుటంబీకులను ఓదార్చారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
రామోజీ రావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. అందులో భాగంగానే గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీ చితికి ఆయన కుమారుడు సీహెచ్ కిరణ్ నిప్పంటించారు. రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బంది, అభిమానులంతా ‘జోహార్ రామోజీరావు’ అంటూ నినాదాలతో రామోజీ రావుకు కడసారి వీడ్కోలు పలికారు.