Posted on 2026-07-30 16:26:39
విగ్రహ తయారీదారులతో నగర సీపీ సజ్జనర్ సమన్వయ సమీక్షా సమావేశం
డైలీ భారత్, హైదరాబాద్: రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా, పర్యావరణహితంగా నిర్వహించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం ముందస్తు సన్నద్ధతను వేగవంతం చేసింది. ఇప్పటికే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో భేటీ అయిన ఉన్నతాధికారులు.. తాజాగా విగ్రహ తయారీదారులతో సమన్వయ సమీక్ష నిర్వహించారు. బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీ మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా నగర సీపీ సజ్జనర్ మాట్లాడుతూ... విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి శోభాయాత్ర, నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు. గత ఏడాది నగర కమిషనరేట్ పరిధిలో దాదాపు 23 వేల విగ్రహాలను ప్రతిష్టించారని, అయితే రవాణా సమయంలో నాలుగు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని గుర్తుచేసిన ఆయన, ఈసారి అటువంటి పొరపాట్లకు తావులేకుండా తయారీ దశ నుంచే పక్కా భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో చర్చించిన మేరకు విగ్రహాల గరిష్ఠ ఎత్తును 16 అడుగులకే పరిమితం చేయాలన్నారు.
కళాకారులు సామాజిక బాధ్యతతో మట్టి విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహించాలని, భక్తులు కూడా సులభంగా నిమజ్జనమయ్యే చిన్న విగ్రహాల వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విగ్రహాల తయారీ వర్క్షాప్లలో ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ చర్యలు చేపడుతూ, విద్యుత్ వైరింగ్ సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని, ఆవరణలను ప్రమాదకర రసాయనాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. తయారీదారులకు అవసరమైన మౌలిక వసతులను వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో కల్పించేలా సిటీ పోలీస్ విభాగం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ట్రాఫిక్ నియంత్రణ, సురక్షిత రవాణాపై దిశానిర్దేశం చేస్తూ ధూల్పేట్, జల్ పల్లి, మైలార్దేవ్పల్లి వంటి ప్రధాన కేంద్రాల నుంచి విగ్రహాలను నగరంలోకి సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
రద్దీ సమయాల్లో భారీ విగ్రహాల రవాణాను పూర్తిగా నివారించాలని, స్థానిక ట్రాఫిక్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి క్లియరెన్స్ పొందాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రవాణా ఏర్పాట్లను ముందస్తుగా పర్యవేక్షించేందుకు వీలుగా విగ్రహాల కొనుగోలుకు సంబంధించి తయారీదారులు ఎప్పటికప్పుడు తమ బుకింగ్ వివరాలను స్థానిక లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ అధికారులకు తెలియజేయాలని సూచించారు.
అదేవిధంగా, విగ్రహాలను ఆయా మండపాలకు తరలించే ఆగమనం సమయం, మార్గాల గురించిన ముందస్తు సమాచారాన్ని కూడా కచ్చితంగా అందించాలని స్పష్టం చేశారు. అతిపెద్ద విగ్రహాలను తరలించే సమయంలో ఓవర్ హెడ్ విద్యుత్ తీగలు, ఫ్లైఓవర్లు, మెట్రో నిర్మాణాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులతో ముందస్తు రవాణా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. విగ్రహాల లోడింగ్, అన్లోడింగ్ కోసం ఉపయోగించే క్రేన్లు, రవాణా వాహనాలు కచ్చితంగా సర్టిఫైడ్ అయి ఉండి, అనుభవజ్ఞులైన నిపుణుల ద్వారా మాత్రమే నిర్వహించబడాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టప్రకారం చర్యలుంటాయన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో అదనపు సీపీ (శాంతిభద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, ఐపీఎస్, ట్రాఫిక్ డిసిపిలు కాజల్ సింగ్, రాహుల్ హెగ్డే, గోల్కొండ జోన్ డిసిపి జె. రాఘవేందర్ రెడ్డి, శంషాబాద్ జోన్ డిసిపి బి. రాజేష్లతో పాటు పలువురు అదనపు డీసీపీలు, ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ అధికారులు, విగ్రహ తయారీదారులు పాల్గొన్నారు.
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >