డైలీ భారత్, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆదేశాల ప్రకారం, అశ్వాపురం సిఐ ఎల్లయ్య సూచనల మేరకు బుధవారం అశ్వాపురం మండలంలో పోలీసులు గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గంజాయి సేవించడం, విక్రయించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి కార్యకలాపాలపై వచ్చిన ముందస్తు సమాచారం ఆధారంగా అనుమానిత ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాలు, కిరాణా దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ను వినియోగించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయిని ఎక్కడ దాచి ఉంచినా సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందని అశ్వాపురం ఎస్ఐ రాజేష్ తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే అశ్వాపురం పోలీసులకు అందించాలని ప్రజలకు ఎస్ఐ రాజేష్ విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.