డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:లోన్ ఇప్పిస్తామని నమ్మించి ఓ మహిళను సైబర్ కేటుగాళ్లు రూ.6.70 లక్షలు మోసం చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం గౌతాపురం కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎస్సై మేడాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, లోన్ మంజూరు చేస్తామని చెప్పిన గుర్తుతెలియని వ్యక్తులు బాధితురాలి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫొటోతో పాటు ఇతర వ్యక్తిగత వివరాలు తీసుకున్నారు.
ఆ తర్వాత ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి వాట్సాప్ ద్వారా పంపుతూ, డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో భయపడిన మహిళ విడతల వారీగా మొత్తం రూ.6.70 లక్షలు నిందితులు సూచించిన ఖాతాలకు బదిలీ చేసింది.
విషయం తెలుసుకున్న బూర్గంపహాడ్ పోలీసులు వెంటనే బ్యాంకు అధికారులతో సమన్వయం చేసి రూ.3.20 లక్షలను హోల్డ్ చేయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.
అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచన...
లోన్, ఉద్యోగం, బహుమతి, పెట్టుబడుల పేరుతో వచ్చే తెలియని కాల్స్, మెసేజ్లను నమ్మవద్దని ఎస్సై మేడాప్రసాద్ హెచ్చరించారు. ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, OTPలు, వ్యక్తిగత ఫొటోలు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని సూచించారు.
మార్ఫింగ్ ఫొటోలు లేదా వీడియోలతో బెదిరిస్తే భయపడకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ కు ఫిర్యాదు చేయాలని, ఆ తర్వాత సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని కోరారు.