| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. విజయ్ కుమార్‌కు ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి "ఉత్తమ ప్రిన్సిపల్ పురస్కారం"

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. విజయ్ కుమార్‌కు ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి "ఉత్తమ ప్రిన్సిపల్ పురస్కారం"

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు ప్రదానం

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. విజయ్ కుమార్ రాష్ట్రస్థాయి "ఉత్తమ ప్రిన్సిపల్  పురస్కారాన్ని" అందుకున్నారు. 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్‌  పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. 

విద్యా రంగంలో ఆయన చేసిన విశేష కృషికి, కళాశాల అభ్యున్నతికి అందించిన అద్భుత సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందజేసింది.

డాక్టర్ కే. విజయ్ కుమార్ కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి తనదైన శైలిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. 

ఆయన నేతృత్వంలో  విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, గత విద్యా సంవత్సరంలో కళాశాలలో రికార్డు స్థాయిలో అడ్మిషన్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రతి తరగతి గదిని డిజిటల్ క్లాస్ రూమ్‌గా మార్చి, ఆధునిక సాంకేతికతతో కూడిన ఆకర్షణీయమైన బోధనను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులలో ఇన్నోవేషన్ ఆలోచనలను ప్రోత్సహిస్తూ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులే స్వయంగా "హోమ్ నీడ్స్" ఉత్పత్తులను తయారు చేసేలా మార్గదర్శకత్వం చేశారు. ఈ ఉత్పత్తుల విక్రయం ద్వారా విద్యార్థులు స్వయం సమృద్ధి సాధించారు. 

కళాశాల సుందరీకరణతో పాటు అధ్యాపకులను నిరంతరం ప్రోత్సహిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెమినార్లు, వర్క్‌షాప్‌లు మరియు అవగాహన సదస్సులను విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్  "ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు" కేవలం వ్యక్తిగతంగా నాకు వచ్చిన గుర్తింపు కాదు; ఇది కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కుటుంబం అంతటి ఉమ్మడి కృషికి దక్కిన గౌరవం. నిరంతరం శ్రమిస్తూ కళాశాల ప్రగతికి తోడ్పడుతున్న వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, ఆఫీస్ సిబ్బంది మరియు విద్యార్థులు,సంఘాల సహకారంతో ఇది సాధ్యమైంది. 

ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్ స్థాయి వసతులు, వినూత్న బోధన అందించడమే కళాశాల లక్ష్యమని,ఈ పురస్కారం నా పై మరింత బాధ్యతను పెంచింది. భవిష్యత్తులో కళాశాలను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు పునరంకితమవుతాను అని తెలిపారు.

ప్రిన్సిపాల్ డాక్టర్ కే. విజయ్ కుమార్ రాష్ట్రస్థాయిలో "ఉత్తమ ప్రిన్సిపల్  అవార్డు" అందుకోవడం పట్ల కళాశాలలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. కిష్టయ్య, అధ్యాపకులు, పరిపాలనా సిబ్బంది, విద్యార్థులు మరియు స్థానిక పౌర సమాజ ప్రతినిధులు ప్రిన్సిపాల్ కి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేశారు.

Previous హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి
Next ఘోర అగ్నిప్రమాదం... విదేశీయులతో సహా పలువురు సజీవదహనం
ADVERTISEMENT