రాజకీయ అండ చూసుకుని విర్రవీగితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది
విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ను అవమానిస్తే సహించేది లేదు: షాద్నగర్ పోలీసుల హెచ్చరిక
ఖాకీపై ఖద్దరు అహంకారం..
చటాన్పల్లి ఘటనలో నిందితుడిపై చట్టపరమైన చర్యలు
డైలీ భారత్, షాద్నగర్: విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తించి, ఆమెను అవమానపరిచిన నాగరాజు అనే వ్యక్తిపై షాద్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించమని కోరినందుకు ఒక ప్రభుత్వ ఉద్యోగి అని కూడా చూడకుండా అహంకారంతో వ్యవహరించిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘటన వివరాలు:
షాద్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో గత నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్న తిరుపతమ్మ అనే కానిస్టేబుల్, ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో చటాన్పల్లి రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఆ సమయంలో దూసుకల్ వైపు నుండి ఒక కారు అత్యంత నిర్లక్ష్యంగా రాంగ్ రూట్లో దూసుకువచ్చింది. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఆమె ఆ కారును ఆపి, సరైన మార్గంలో వెళ్లాలని సూచించారు.
అవమానకరంగా ప్రవర్తన:
కానిస్టేబుల్ సూచనతో ఆగ్రహానికి గురైన కారులోని వ్యక్తి నాగరాజు, "నేనెవరో తెలుసా? నన్ను ఆపుతావా?" అంటూ ఆమెతో గొడవకు దిగాడు. అంతేకాకుండా, విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిని "లేబర్లా ఎందుకు అరుస్తున్నావు?" అంటూ అత్యంత అవమానకరమైన పదజాలంతో దూషించి, జులుం ప్రదర్శించాడు. తన రాజకీయ పలుకుబడిని చూపిస్తూ ఆమెను బెదిరించే ప్రయత్నం చేశాడు.
నాగరాజు పై కేసు నమోదు:
బాధితురాలు తిరుపతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాద్నగర్ పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి సెక్షన్ల కింద చర్యలు తీసుకోనున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అండదండలు ఉన్నాయని అతిక్రమిస్తే ఊరుకునేది లేదని పట్టణ సీఐ ఈ సందర్భంగా హెచ్చరించారు.