10 మందికి ఒక రోజు జైలు, 3 మందికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా
మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే జైలు శిక్షతో పాటు జరిమానా తప్పదు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్పై దృష్టి సారించి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ కఠిన చర్యలు చేపడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 71 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడగా, వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు ₹81,500 జరిమానా విధించింది. అదేవిధంగా 10 మందికి ఒక రోజు జైలు శిక్ష, 3 మందికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమైన చర్య అని తెలిపారు. మద్యం ప్రభావంలో డ్రైవింగ్ చేయడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయి తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయని, క్షణిక నిర్లక్ష్యం జీవితాంతం పశ్చాత్తాపానికి కారణమవుతుందని అన్నారు. ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు, చట్టపరమైన చర్యలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ తెలిపారు.
మద్యం సేవించి వాహనం నడపడం నేరం. మీ భద్రతతో పాటు ఇతరుల ప్రాణాల భద్రత కోసం కూడా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించండి.