మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి..
వీర్నపల్లి కేజీబీవీ లో తనిఖీలో కలెక్టర్ గరిమ అగ్రవాల్..
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్ పరిశీలించారు. అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్లి బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ చార్ట్ ప్రకారం ఈ రోజు ఏ ఏ ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారో పరిశీలించారు. స్టోర్ రూమ్ లో పప్పులు, నూనె, నెయ్యి, ఇతర పదార్థాల నాణ్యత, గడువు తేదీని తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నిల్వకు సంబంధించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు కచ్చితంగా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... విద్యార్థులు అందరూ తరగతులకు హాజరయ్యాలా చూడాలని సూచించారు. విద్యార్థులు ప్రణాళిక ప్రకారం పాఠ్యాంశాలు శ్రద్ధగా చదువుకోవాలని తెలిపారు. పరిశీలనలో మండల ప్రత్యేక అధికారి క్రాంతి, తహసీల్దార్ నారాయణ రెడ్డి, సర్పంచ్ జ్యోత్స్న తదితరులు ఉన్నారు.