డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: చుంచుపల్లి మండలం పెనగడప ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వలు, కొనుగోలు ప్రక్రియ, లోడింగ్, రవాణా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కేంద్రంలో సుమారు 1200 క్వింటాళ్ల ధాన్యం నిల్వలు ఉన్నాయని, వాటిని సుజాతనగర్లోని రైస్ మిల్కు రెండు రోజులలోపు తరలించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ అకాల వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, కవర్లు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షపు నీరు నిల్వల వద్ద చేరకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలిస్తూ లోడింగ్, రవాణా పనులను సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు తాగునీరు, నీడ తదితర సదుపాయాలు కల్పించాలని తెలిపారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS అన్నారు.
ఈ పరిశీలనలో డీసీఓ ప్రేమ్ కుమార్, డీఎం సతీష్, చుంచుపల్లి తాసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో సుభాషిణి, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
#PaddyProcurement #FarmersWelfare #RainAlert #Agriculture #BhadradriKothagudem #Telangana #PrajaPalana