డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(పోలీస్ ఫ్లాగ్ డే)సందర్భంగా 17వ బెటాలియన్ సర్దాపూర్ నందు నిర్వహించిన స్మృతి పరేడ్ కార్యక్రమంలో 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ముఖ్య అతిథిగా పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ 1959 వ సంవత్సరంలో భారత్ చైనా సరిహద్దులో విధి నిర్వహణలో అమరులైన భారత పోలీసులను స్మరించుకుంటూ దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించుకుంటామని తెలిపారు. అమరులైన పోలీసుల సేవల్ని కొనియాడారు.
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మనకు స్ఫూర్తి అన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని కొనియాడారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, మతతత్వ దోరణిలో సంఘ విద్రోహక శక్తులు హింసలకు పాల్పడుతున్నాయని.. ఇలాంటి శక్తుల్ని ఎదుర్కొంటూ ఎందరో పోలీసు సోదరులు వీరమరణం పొందారన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. పోలీసుల అమరత్వం నుంచి స్ఫూర్తిని, ప్రేరణ పొందుతున్నామన్నారు.పోలీసు అంటేనే పట్టుదల, ఓర్పు, సహనమని శాంతి భద్రతలు కాపాడేందుకు వారు చేసే కృషి మరువలేనిదన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు శ్రీ ఎ.జయ ప్రకాశ్ నారాయణ , శ్రీ యమ్.పార్థసారథి రెడ్డి , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి బి.శైలజ ,అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.